Man Pushed Woman and Two Children into River: సహజీవనం చేస్తున్న వ్యక్తి ఘాతుకం! మహిళ, ఇద్దరు పిల్లలను నదిలో తోసేశాడు.. కానీ! - ఫొటో తీసుకుందామని చెప్పి నదిలో తోసేశాడు
🎬 Watch Now: Feature Video

Man Pushed Woman and Two Children into River: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో.. గౌతమి వంతెనపై నుంచి గోదావరిలోకి మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలను ఓ వ్యక్తి నెట్టేసిన ఘటన సంచలనం రేకెత్తించింది. ఈ దారుణ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతవగా.. మరో కుమార్తె వంతెనకున్న పైపును పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సుహాసిని భర్తతో విడాకులు తీసుకుని.. గుడివాడకు చెందిన ఉలవ సురేశ్తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోందని పోలీసులు తెలిపారు. అయితే ఇటీవల ఈ ఇద్దరి మధ్య గొడవల కారణంగా.. సుహాసినితో పాటు ఆమె పిల్లలను చంపివేయాలని సురేశ్ నిర్ణయించుకున్నాడు. కారు కొనుగోలు చేద్దామని చెప్పి.. సుహాసిని, ఇద్దరి పిల్లలితో కలిసి రాజమహేంద్రవరానికి ఆదివారం వేకువజామున పయనమయ్యాడు. సుహాసినితో పాటు ఆమె ఏడాది పాప జెర్సీ, మరో కుమార్తె కీర్తనలను.. రావులపాలెం గౌతమి వంతెన వద్ద ఫొటో తీసుకుందామని చెప్పి కారు దింపాడు. ముందుగా ఆమెను గోదావరిలోకి నెట్టి వేశాడు. ఆపై కారులో ఉన్న చిన్నారి జెర్సీని గోదావరిలో విసిరేశాడు. 13 ఏళ్ల కీర్తననూ వంతెన పైనుంచి నెట్టి వేయగా..ఆ బాలిక, వంతెనకున్న కేబుల్ గొట్టాన్ని పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది. ముగ్గురూ గోదావరిలో పడిపోయారని భావించిన సురేష్ అక్కడి నుంచి కారులో పరారయ్యాడు. అయితే, పైప్ పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్న కీర్తన.. తన వద్ద ఉన్న ఫోన్తో ఎమార్జెన్సీ కాల్ చేయగా.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలికను కాపాడారు. బాలిక సుమార అరగంట సేపు పైపును పట్టుకుని వేలాడటం.. పోలీసులను సైతం కలచివేసింది. నదిలో పడిపోయిన తల్లి, ఏడాది చిన్నారి కోసం పోలీసులు గోదావరిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. నిందితుడి కోసం రావులపాలెం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.