Woman Living on the Road After Doctor Not Allowing In Hospital : సుస్తి చేసిందని ఓ మహిళ ఆసుపత్రికి వెళితే కేవలం ఆధార్ కార్డు లేదన్న కారణంతో వైద్య సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకోలేదు. అదీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో. నిబంధనలను సరిగా అర్థం చేసుకోకుండా, జనాన్ని గాలికి వదిలేస్తున్న కొందరి వైద్య సిబ్బంది తీరును చూస్తే చాలా ఆందోళనను కలిగిస్తోంది. ఈ విషయాలు అన్ని చూస్తున్న అభం శుభం తెలియని చిన్నారి తన తల్లిని ఒడిలో పెట్టుకుని సేవ చేస్తూ అసలేం జరుగుతుందో, ఎవరిని అడగాలో తెలియక, ఎందుకు మా అమ్మను ఆసుపత్రిలో చేర్చుకోలేదు, ఏం చేయాలో తోచక అక్కడే రోడ్డుపై జీవిస్తూ దిక్కు తోచని స్థితిలో తల్లికుమార్తెలు ఉన్నారు. ఈ దృశ్యాలను చూస్తున్న వారికి కళ్లంట కన్నీళ్లు తెప్పిస్తోంది. అసలు వారు ఎక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చారు? దీనస్థితికి గల కారణాలు ఏంటీ?
ప్రాణాలు నిలుపుకునేందుకు విశ్వ ప్రయత్నాలు :మహబూబ్నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీల భర్త సురేశ్ ఆరు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయారు. భర్త మృతి చెందిన నెల రోజులకు కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దిక్కుతోచని ఆ తల్లి ఆరేళ్ల కుమార్తెను వెంటబెట్టుకుని హైదరాబాద్కు వలస వచ్చేసింది. దొరికితే చిన్నపాటి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించడం. లేదంటే భిక్షాటనతో తమ రెండు ప్రాణాలను నిలుపుకునేందుకు విశ్వప్రయత్నాలు ఆమె చేస్తోంది. కానీ విధి మాత్రం ఆమెను పరీక్షిస్తూనే ఉంది. ఆమెకూ సుస్తి చేయడంతో కదలలేని స్థితికి చేరింది.