తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు దంపతులు - ఏపీ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video


Published : Dec 1, 2023, 8:54 AM IST
|Updated : Dec 1, 2023, 12:03 PM IST
TDP Chief Nara Chandrababu Visited Tirumala Temple: టీడీపీ అధినేత నారా చంద్రబాబు.. సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం చేసిన వేదపండితులు.. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకోనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే కాపాడారన్న ఆయన.. ధర్మాన్ని కాపాడాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలని ఆయన అన్నారు. ఈ క్రమంలో త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తానని చంద్రబాబు వెల్లడించారు.
TDP Parliamentary Party Meeting: అనంతరం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్లో ఎండగట్టేలా పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు.. డిసెంబర్ 3న సింహాచలం అప్పన్న ఆలయానికి వెళ్లనున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 5వ తేదీన శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు.