ETV Bharat / city

కేసులు పెరిగినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధం: కేసీఆర్ - తెలంగాణ లాక్​డౌన్

కరోనా విషయంలో ప్రజలు భయోత్పాతానికి గురి కావాల్సిన పనిలేదని, లాక్​డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఏమీ లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచించారు. ఒక వేళ రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ, తగిన వైద్య సేవలు అందించడానికి వైద్య, ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. వైరస్ సోకిన వారిలో ఎవరికైనా ఆరోగ్యం బాగా క్షీణిస్తే అత్యవసర వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

cm kcr
cm kcr
author img

By

Published : May 27, 2020, 9:56 PM IST

కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైరస్ సోకిన తర్వాత కూడా 80 శాతం మందిలో కనీసం వ్యాధి లక్షణాలు కూడా కనిపించడం లేదన్నారు. వారికి ఎలాంటి వైద్యం కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు. 15 శాతం మందిలో జలుబు, జ్వరం, దగ్గు, దమ్ము లాంటి ఐఎల్ఐ లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఐఎల్ఐ లక్షణాలున్న వారు త్వరగానే కోలుకుంటారన్నారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

మిగతా 5 శాతం మందిలో మాత్రమే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే సారి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఈ 5 శాతం మంది విషయంలోనే ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. వీరిలోనే మరణించే వారు ఎక్కువ ఉంటారని చెప్పారు. భారతదేశంలో 2.86 శాతం, తెలంగాణలో 2.82 శాతం మరణాల రేటు ఉందని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ప్రజల కదలిక పెరిగిందని... ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వివిధ మార్గాల ద్వారా రాకపోకలు పెరిగాయన్నారు. అయినప్పటికీ వైరస్ ఉన్నట్లుండి ఉద్ధృతంగా వ్యాప్తి చెందలేదన్నారు. ఇది మంచి పరిణామమని... మొత్తంగా తేలేదిమిటంటే, కరోనా వైరస్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ వివరించారు. కానీ కరోనాకు వ్యాక్సిన్, ఔషధం రాలేదు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి. కరోనా వైరస్ సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే కొద్ది మందిలో మాత్రం లక్షణాలు కనిపిస్తున్నాయి. వారికి మంచి వైద్యం అందించాలి. సీరియస్​గా ఉన్న వారి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. వారిని ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. పాజిటివ్​గా తేలినప్పటికీ లక్షణాలు లేని వారిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రజలు కూడా లాక్ డౌన్ నిబంధనలు, కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలి. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని అంచనాలు ప్రకారం రాబోయే రెండు మూడు నెలల్లో దేశంలో పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని సీఎం అన్నారు. అయినప్పటికీ ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. తెలంగాణలో పాజిటివ్ కేసులు ఎక్కువైనా సరే, ఎంత మందికంటే అంతమందికి వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అవసరమైన పీపీఈ కిట్లు, టెస్టు కిట్లు, మాస్కులు, బెడ్స్, వెంటిలేటర్లు, ఆసుపత్రులు అన్నీ సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.