తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్కెట్​లో రేటు కొండంత - రైతన్న చేతికి అందేది మాత్రం గోరంత

పంట వేసే సమయంలో ధరల పెరుగుదల - మార్కెట్లకు వచ్చేటప్పుడు తగ్గుదల - అంతంత మాత్రంగానే మార్కెట్లు, నిల్వ సౌకర్యాలు - పప్పు దినుసులైన పెసర, శనగ, కందులపై నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Special Story on pulses cultivation
RBI Released Report on Pulses Cultivation (ETV Bharat)

RBI Released Report on Pulses Cultivation :రైతే రాజుగా ఉన్న ఈ దేశంలో పప్పులు పండించే కర్షకులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. పప్పు దినుసుల నిల్వకు తగిన వసతులు, మార్కెటింగ్‌ సౌకర్యాలు లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మేరకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) నివేదకను విడుదల చేసింది. ఈ నివేదికలో పలు వివరాలను వెల్లడించింది. పప్పు దినుసుల సాగులో స్వయం సమృద్ధి సాధించేందుకు అవకాశాలున్నా, ప్రభుత్వం అందుకు తగ్గట్లు కృషి చేయడం లేదని, ఇంకా దిగుమతుల మీదనే ఆధారపడుతున్నట్లు తెలిపింది. దేశంలో ప్రధానమైన పప్పు దినుసులైన పెసర, శనగ, కందులపై ఆర్​బీఐ అధ్యయన నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రపంచంలోనే పప్పు దినుసుల సాగులో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పప్పు దినుసుల్లో ఇండియా 28 శాతం ఉత్పత్తి చేస్తోంది. అయినా 2022లో అవసరాల మేరకు 2.5 మిలియన్‌ టన్నులను ఇండియా దిగుమతి చేసుకుంది. దేశీయ ఉత్పత్తుల కంటే 9 శాతం ఎక్కువ. పప్పుల సాగు విస్తీర్ణంలో దేశంలోని మొత్తం 49.5 శాతం శనగలే. ఆ తర్వాత 14.1% కందులు. రాష్ట్రంలో రైతులు పండించే పప్పు దినుసుల్లో ప్రధానమైంది కంది. కంది కొనుగోలు ద్వారా వచ్చే ప్రతి రూపాయిలో రైతులకు 65 పైసలు, పెసర ద్వారా 70 పైసలు, శనగలకు 75 పైసలు లభిస్తోంది.

ఏటా సేకరించిన పప్పుల పట్టిక (ETV Bharat)

పప్పుల క్రయవిక్రయాలు కొన్ని మార్కెట్లలోనే: పప్పు దినుసులను సన్న, చిన్నకారు రైతులే ఎక్కువగా పండిస్తున్నారు. పప్పుల క్రయవిక్రయాలు కొన్ని మార్కెట్లలోనే ఉన్నాయి. దీంతో రైతులు అక్కడికి సరుకులను తీసుకుని వెళ్తున్నారు. దీని వల్ల రవాణాకు భారీగా ఖర్చవుతోంది. మార్కెట్లలో రుసుములు, ఇతర ఖర్చులు సైతం వారే భరిస్తున్నారు. ధర విషయంలో అక్కడి వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు, టోకు, చిల్లర వర్తకులు, మిల్లర్ల మీదనే వారు ఆధారపడుతున్నారు. మద్దతు ధరల విధానం ఉన్నా, వ్యాపారుల నుంచి అది లభించడం గగనంగా మారింది.

ఉత్పత్తికి అయిన ఖర్చు కంటే తక్కువ ధరలకే రైతులు విక్రయిస్తున్నారు. ఏటా పంటలు వేసే సమయంలో ధరలు పెరుగుతాయి. కానీ పంటలు మార్కెట్​కు వచ్చే సమయంలో ధరలు తగ్గుతాయి. గత దశాబ్ద కాలంలో ఏప్రిల్‌లో ధరలు తగ్గడం, మళ్లీ నవంబరులో పెరగడం ఇలా ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం పప్పు దినుసుల శుద్ధి సౌకర్యాలు ప్రైవేట్​ రంగంలోనే ఉన్నాయి. అవి చిన్నతరహా మిల్లులే కాకుండా గ్రామాలకు దూరంగా ఉన్నాయి. అక్కడి రవాణా ఖర్చులు, రుసుములను రైతులు భరిస్తున్నారు.

తగిన లాభాలు రాక : పప్పులు పండించే రైతులకు తగిన లాభాలు రావడం లేదు. అయినా విధానపరమైన లోపాల వల్ల గత దశాబ్దంలో పప్పుల ధరలు పెరిగాయి. 2015-16, 2016-17 సంవత్సరాలతో పాటు కరోనా తర్వాత కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వినియోగానికి, ఉత్పత్తికి, సరఫరాకు మధ్య అంతరం ఉండగా ప్రభుత్వం దానిని పరిష్కరించేలా తగిన ప్రయత్నాలు చేయలేదు. అవసరాలకు అనుగుణంగా పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించకపోవడంతో ప్రతికూల ప్రభావం చూపుతోంది.

ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం.. అసలు వీటితో ఎంత మేలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details