Indian National Deportation From US : అమెరికా నుంచి 116 మంది భారతీయులతో కూడిన రెండో విమానం భారత్ చేరింది. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో సీ-17 సైనిక విమానం పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలో లాండ్ అయింది.
అక్రమ వలసదారులని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిలో పంజాబ్కు చెందినవారు 65, మంది, హరియాణా నుంచి 33మంది, గుజరాత్కు చెందిన వారు 8మంది చొప్పున ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన వారు ఇద్దరు చొప్పున, హిమచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ వాసులు ఒక్కొక్కరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఆరేళ్ల అమ్మాయి సహా ఇద్దరు మైనర్లు ఉన్నారు తెలుస్తోంది. ఈ విమానంలో వచ్చిన వాళ్లలో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల వయసున్నవారేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరే కాకుండా 157మందితో మూడో విమానం ఆదివారం భారత్కు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 104మందితో తొలి బృందం ఈనెల 5న స్వదేశం చేరుకుంది.
'ఇక్కడే ఎందుకు'
అక్రమ వలసదారుల విమానాలను దిల్లీలో కాకుండా పంజాబ్లోని అమృత్సర్లోనే ల్యాండ్ చెయ్యడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్ను, అక్కడి ప్రజలను అప్రతిష్టపాలు చేసే కుట్రలో భాగంగా కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అక్రమవలసదారుల అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేస్తోందని దుయ్యబట్టింది. పంజాబ్ నుంచి అమాయకపు యువత అమెరికాకు అక్రమంగా ఎందుకు, ఎలా వెళ్లాల్సి వచ్చిందో, ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు బీజేపీ నేత తరుణ్ చుగ్ అన్నారు. యువత వద్ద నుంచి డబ్బులు తీసుకుని అక్రమ దారిలో వారిని అమెరికాకు పంపిన నిందితులను పట్టుకోకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమెరికా నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాలకు భారత్ల పంజాబ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండటం వల్లే అక్కడ ల్యాండ్ అవుతున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ తెలిపారు.