Stroke Reducing Foods : మీకు 30 ఏళ్లు దాటాయా? అయితే మీరు తినే ఆహారంలో ఈ పదార్థాలు చేర్చుకుంటే మంచిదట! వీటిని మీ డైట్లో జతచేసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు చెబుతున్నారు. మన జీర్ణవ్యవస్థకు మెదడు ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందని 18వ శతాబ్దంలోనే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ నేపథ్యంలోనే వాటిపైన మరింత అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా జీర్ణవ్యవస్థలోని సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియా.. మెదడు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించారు. ఇందులో శరీరంలోని రెండు ప్రధాన భాగాలైన జీర్ణవాహిక, కేంద్ర నాడీ వ్యవస్థ మధ్య పరస్పర కమ్యూనికేషన్ జరిగినట్లు తేల్చారు. ప్రోబయాటిక్స్ గుణాలున్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి మెదడును రక్షిస్తుందని వెల్లడించారు.
మరోవైపు జీర్ణవ్యవస్థలోని సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరగడం వల్ల దీర్ఘకాలంలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తేల్చారు. 2025లో journal Food and Functionలో ప్రచురితమైన "Gut microbiota diversity and risk of stroke: A systematic review and meta-analysis" అనే అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే జీర్ణవ్యవస్థ, మెదడు మధ్య ఉన్న సంబంధంపై చైనాకు చెందిన ఫుడాన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేష్ సర్వేలోని డేటాను సేకరించి పరిశీలించారు. ఇందులో 20ఏళ్లు దాటిన వివిధ ప్రాంతాలు, వివిధ ఆహారపు అలవాట్లు ఉన్న 48,677 మంది వివరాలు సేకరించారు. వీరికి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పెంచే అవకాడోలు, బ్రకోలీ, కాఫీ, శనగలు, క్రాన్బెర్రీలు, డెయిరీ పదార్థాలు, సోయా, తృణధాన్యాలు ఆధారంగా ఎక్కువ స్కోర్లు ఇచ్చారు. దీంతో పాటు ప్రాసెస్ చేసిన ఆహారం, మాంసం తీసుకున్నవారికి తక్కువ స్కోర్లు ఇచ్చి విభజించారు. ఇందులో 20-29 ఏళ్ల మధ్య ఉన్నవారిలో ఎలాంటి మార్పులను గమనించలేదని పరిశోధకులు వెల్లడించారు. అదే 30 ఏళ్లు దాటినవారిలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే.. స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గినట్లు కనిపెట్టారు. ముఖ్యంగా ఆకుకూరలు, వివిధ రకాల పోషకాలు ఉన్న ఆహారం తినేవారిలో స్ట్రోక్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువని తెలిపారు.
మరోవైపు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా లేకపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని 2022లో journal Frontiers in Immunologyలో ప్రచురితమైన అధ్యయనంలో తేలింది. జీర్ణవ్యవస్థలోని సూక్ష్మజీవుల సమతుల్యంగా లేకపోవడం వల్ల హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం, జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇవన్నీ దీర్ఘకాలంలో స్ట్రోక్కు దారితీసే ప్రమాదం ఉందని వివరించారు. అధిక రక్తపోటు, అధిక చక్కెర స్థాయుల, జీర్ణక్రియ సమస్యల వల్ల మెదడులో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుందని వెల్లడించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
స్నానం చేసేటప్పుడు మూత్రం పోస్తున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
షుగర్ పేషెంట్లు రోజుకు ఎన్నిసార్లు తినాలి? మూడు సార్లు మాత్రం కాదట! మరెంతో తెలుసా?