Kohli Rohit T20 Retirement :భారత టీ20 క్రికెట్లో ఓ శకం ముగిసింది. స్టార్ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ ఆటకు వీడ్కోలు పలికారు. పొట్టి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ విజయం సాధించిన అనంతరం టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. అయితే మరో టీ20 వరల్డ్ కప్కు రెండేళ్ల సమయమే మిగిలి ఉంది. మరి భారత జట్టు మేనేజ్మెంట్ విరాట్, హిట్ మ్యాన్ లేని లోటును వీలైనంత త్వరగా భర్తీ చేయగలదా? అలా చేస్తేనే ప్రపంచ కప్ టైటిల్ రేసులో భారత్ ముందుంటుంది. అయితే కోహ్లీ, రోహిత్ ప్లేస్లో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.
కేఎల్ రాహుల్ -కోహ్లీ, రోహిత్ టీ20ల నుంచి తప్పుకోవడంతో టాప్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ ఒక్కడే సీనియర్. పంత్, సంజు శాంసన్ ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటం వల్ల ఈ టీ20 వరల్డ్ కప్లో స్థానం దక్కలేదు. అయితే 72 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం అతడికి ఉంది. కాబట్టి ఇప్పుడు కోహ్లీ, రోహిత్ బాధ్యతను రాహుల్ తీసుకుని ముందుకు నడవాల్సిన అవసరముంది.
శుభ్మన్ గిల్ -వన్డే రెగ్యులర్ ప్లేయర్గా ఉన్న శుభ్మన్ గిల్కు టీ20లోనూ మంచి రికార్డ్ ఉంది. ఐపీఎల్ 2023లో 890 పరుగులతో టాప్లో నిలిచాడు. అయితే జాతీయ జట్టు తరఫున మాత్రం టీ20ల్లో పెద్దగా రాణించలేదు. ఇప్పటివరకు 14 టీ20లు ఆడాడు. కేవలం 335 పరుగులే ఖాతాలో వేసుకున్నాడు. కానీ అతడికి టీ20ల్లో మంచిగా రాణించే సత్తా ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. త్వరలో జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్కు ఇతడినే కెప్టెన్గా నియమించారు.
యశస్వి జైస్వాల్ - ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసి భారత టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఓపెనర్గా రాణించి టీ20లో చోటు దక్కించుకున్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్ జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే ఈ టోర్నీలో అతడికి ఒక్క మ్యాచ్లోనూ ఆడే ఛాన్స్ రాలేదు. ఇప్పటివరకు ఇతడు 17 మ్యాచ్లు ఆడాడు. 161.93 స్ట్రెక్రేట్తో 502 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఇతడికి మరింత ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే మరింత రాటుదేలుతాడని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.