YS Sharmila Interview : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్రెడ్డిని తీసుకొచ్చి కడపలో నిలబెట్టడం జగన్కు అధికారం ఉందన్న అహంకారంతోనేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అవినాష్రెడ్డిని చట్టసభలకు వెళ్లకుండా చూడాలనే అక్కడ పోటీ చేస్తున్నానని తెలిపారు. కుటుంబంలో ఒక్కరే రాజకీయాల్లో ఉండాలన్నట్లు జగన్ మాట్లాడారని, వ్యాపారాలు చూసుకోవాలి అంటున్నారని పేర్కొన్నారు. వ్యాపారాలు చేసుకోవాలని అప్పట్లో తాను అనుకుంటే ఈరోజు వైఎస్సార్సీపీ ఎక్కడుండేదని ప్రశ్నించారు.
కడప లోక్సభ స్థానం ఎన్నికల్లో న్యాయానికి, నేరానికి మధ్య పోరాటం జరుగుతోందని, అందులో గెలిచేది న్యాయం వైపున్న తానేనని పీసీసీ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. జగన్ అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారని, ఆయన్ను మించిన ఊసరవెల్లి ఇంకెవరుంటారని నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక రిలయన్స్ సంస్థ హస్తం ఉందని అప్పట్లో ఆరోపించి, వైఎస్సార్సీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టిన జగన్, అధికారంలోకి వచ్చాక అదే రిలయన్స్ మనిషికి ఎంపీ పదవి ఇవ్వడమే ఆయన నైజమేంటో చెప్పిందని విమర్శించారు. ఏపీ ఎన్నికల సందర్భంగా వైఎస్ షర్మిలతో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు : వైఎస్ షర్మిల - lok Sabha Elections 20224
జగన్ మాటలు నమ్మి మోసపోయాం:సీబీఐ ఛార్జిషీట్లో మా నాన్న పేరును కాంగ్రెస్ పార్టీనే చేర్చిందని అప్పట్లో నేను అన్న మాట నిజమే. ఎందుకంటే అప్పట్లో మాకు వాస్తవం తెలీదు. వైఎస్ మరణం వెనుక రిలయన్స్ పాత్ర ఉందని జగన్ చెబితే నిజమే అనుకుని ఆ సంస్థ ఆస్తులపై దాడులు చేసి, కొన్ని వేల మంది ఇప్పటికీ కేసుల్లో తిరుగుతున్నారు. రిలయన్స్పై అంత అభాండం వేసిన జగన్, ముఖ్యమంత్రయ్యాక వాళ్ల మనిషికే ఎంపీ పదవి ఇచ్చారు. వైఎస్ మరణం విషయంలో ఆయన చెప్పింది అబద్ధమని నిరూపించుకున్నారు. వివేకా హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందనీ జగన్ ఎన్నికల ముందు చెప్పారు. సీబీఐ విచారణ కూడా కోరారు. అధికారంలోకి వచ్చాక ఆయనే సీబీఐ విచారణ అక్కర్లేదన్నారు. తద్వారా తను చెబుతున్నది అబద్ధమని మరోమారు నిరూపించుకున్నారు. మా నాన్న పేరును సీబీఐ ఛార్జిషీట్లో చేర్చింది కాంగ్రెస్సేనని ఆయన ఆరోపిస్తే అందరం గుడ్డిగా నమ్మాం.
మా నాన్న పేరును ఛార్జిషీట్లో చేర్చడంలో కాంగ్రెస్ ప్రమేయం లేదని నేను సోనియాగాంధీని కలిసినప్పుడు చెప్పారు. ఇదే మాట తర్వాత ఉండవల్లి అరుణ్కుమార్ కూడా చెప్పారు. వైఎస్ పేరు ఎఫ్ఐఆర్లో లేకపోయినా, జగన్ ఆదేశాల మేరకు పొన్నవోలు సుధాకర్రెడ్డి మూడు కోర్టుల చుట్టూ తిరిగి మరీ ఆయన పేరును ఛార్జిషీట్లో చేర్చేలా చేశారు. వైఎస్ పేరు చేర్చకపోతే ఆ కేసుల నుంచి జగన్ బయటపడటం అసాధ్యమన్న ఉద్దేశంతోనే అదంతా చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు రోజులకే పొన్నవోలుకు అదనపు అడ్వొకేట్ జనరల్ పోస్టు ఇవ్వడమే అదంతా జగనే చేయించారనడానికి రుజువు. నేను అప్పుడో మాట, ఇప్పుడో మాట మాట్లాడుతున్నానని, ఊసరవెల్లినని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నేను కాదు ఇన్ని అబద్ధాలు చెప్పిన జగనే అసలైన ఊసరవెల్లి.
కడపలో పోటీ చేసేదాన్నే కాదు:అవినాష్రెడ్డికి కడప ఎంపీ టికెటివ్వకపోతే నేను అక్కడ పోటీ చేసేదాన్నే కాదు. ప్రపంచంలో ఇంకెవరూ లేరన్నట్టుగా వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్రెడ్డిని తీసుకొచ్చి కడపలో నిలబెట్టడం జగన్కు అధికారం ఉందన్న అహంకారంతోనే. అవినాష్రెడ్డిని చట్టసభలకు వెళ్లకుండా చూడాలనే అక్కడ పోటీ చేస్తున్నాను. ఆయన కడప జిల్లా ప్రజలకు 40 ఏళ్లు సేవ చేశారు. ఆయన్ను హత్య చేసి ఐదేళ్లయినా ఇప్పటికీ న్యాయం జరగలేదు. సీబీఐ ఆధారాలు, సాక్ష్యాలు బయటపెట్టిన తర్వాత కూడా జగన్కు నిజాన్ని అంగీకరించే ధైర్యం లేదు. సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్రెడ్డిని జగన్ ఆయనకున్న కారణాల వల్ల కాపాడుకుంటూ వస్తున్నారు. కర్నూలులో అవినాష్ను అరెస్ట్ చేయడానికి సీబీఐ అధికారులు వెళితే మూడు రోజులపాటు భయంకరమైన వాతావరణం సృష్టించి, వాళ్ల మనుషులు, పోలీసులతో అడ్డుకున్నారు. ఆరోజు సునీత నిస్సహాయంగా ఉండిపోయింది. వివేకా హత్యపై ప్రజా కోర్టులోనైనా తీర్పు రావాలి.
ఆ మాట అవినాష్రెడ్డికి చెప్పొచ్చుగా:కడపలో నాకేదో డిపాజిట్లు కూడా రావని, అందుకే బాధపడుతున్నానన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నారు. ఆయనకు నిజంగా అంత బాధ ఉంటే వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖలో రాసినట్టుగా అవినాష్రెడ్డిని విత్డ్రా చేసుకోమని చెప్పొచ్చు. కానీ నన్ను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. నేను గెలుస్తానన్న నమ్మకం జగన్కు కుదిరింది అందుకే ఆయన సతీమణి భారతి సహా మా కుటుంబంలో ఆయన అధికారానికి, డబ్బులకు లోబడేవారందరినీ మూకుమ్మడిగా ప్రచారంలోకి దించారు. వారంతా జగన్రెడ్డి కూడా ఓడిపోతారన్న భయంతో ఆయన కోసం ప్రచారం చేస్తున్నారా అని అనిపిస్తోంది.
రైతులకే కనిపించని జగన్మోహన్రెడ్డి:కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖరరెడ్డి కల. అది జగన్కూ తెలుసు. అయినా ఈరోజు వరకు ఒక తట్టెడు మట్టి పోయలేదు. ఇది రాజశేఖరరెడ్డి మార్కు రాజకీయమా? రుణమాఫీ, మద్దతు ధర, పెట్టుబడుల తగ్గింపు, రాయితీల విషయంలో రైతుల్ని రాజశేఖరరెడ్డ్డి ఎంతో బాగా చూసుకున్నారు. రూ.4 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పిన జగన్మోహన్రెడ్డి ఒక్క ఏడాదైనా పెట్టారా? అసలు ఆయన రైతులకే కన్పించలేదు. రైతులకు కష్టం వచ్చినా భరోసా ఇచ్చింది లేదు. ఐదు సంక్రాంతులు పోయినా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు.
చిన్నాన్న గురించి ఒక్క మంచిమాట మాట్లాడలేదు: ప్రజల కోసం వివేకా అంత తపించే మంచి మనిషి ఈరోజుల్లో భూతద్దంతో వెతికినా కనిపించరు. అలాంటి మనిషిని పొగిడేందుకు జగన్కు ఈ ఐదేళ్లలో ఒక్క మంచి మాటా దొరకలేదు. ఒక్క పూలదండా వేయలేదు. నివాళులర్పించలేదు. అంతమందితో సభ పెట్టి వివేకా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేందుకు మనసొచ్చిందే తప్ప ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. సామాజిక మాధ్యమాల్లో వివేకా వ్యక్తిత్వానికి ననానికి పాల్పడ్డారు. వివేకా చివరి నిమిషం వరకు వైఎస్సార్సీపీ కోసమే పనిచేశారన్న ఇంగితం కూడా జగన్కు లేకపోయింది. సాక్షి పత్రికలో పైన వైఎస్ ఫొటో ఉంటుంది. కింద వివేకా వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా కథనాలు రాస్తారు.
నిశ్శబ్ద విప్లవం రాబోతోంది:తమ అభిమానపాత్రుడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారనే విషయం కడప ప్రజలందరికీ తెలుసు.న్యాయం కోసం సునీత ఎక్కని కోర్టు మెట్టు లేదు. తట్టని తలుపు లేదు. హత్య చేసినవారు వీరే అని సీబీఐ చెబుతున్నా జగన్ అవినాష్రెడ్డిని కాపాడుతూ వచ్చారు. ఇవన్నీ కడప ప్రజలు చూస్తున్నారు. అందుకే నిశ్శబ్ద విప్లవం రాబోతోంది. వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని, షర్మిలను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ విజయం కడప నుంచే మొదలు: కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితిలో ఉన్నప్పుడు 1983లో రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చారు. విధి రాతేమో తెలియదు. 40 ఏళ్ల తర్వాత నేను మళ్లీ కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలోనే పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాను. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఈ దఫా ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. మా పార్టీ విజయం కడప నుంచే మొదలవుతుంది.
కడప ప్రజల గొంతుకనవుతా: రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి ఈ ప్రాంతానికి నాయకులుగా ఎంతో చేశారు. అదే అవకాశాన్ని నాకు ఇవ్వమని ప్రజల్ని కోరుతున్నా. రాజశేఖరరెడ్డి బిడ్డగా మాటిస్తున్నా, నన్ను గెలిపిస్తే మీ బలం అవుతా. మీ గొంతుకనవుతా. మీ కోసం కొట్లాడతా. ఏ నాయకుడికీ భయపడాల్సిన పనిలేదు. ఇక్కడే, జనానికి అండగా నిలబడతా. ఈ గడ్డకే జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నా.