Justice Hema Committee On Malayalam Film Industry: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ హేమ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలు తమకు వెల్లడించిన లైంగిక వేధిపుల కథనాలు విని షాక్కు గురయ్యామని కమిటీ పేర్కొంది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ నివేదికను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి, దోపిడీలు, అన్యాయానికి సంబంధించిన విషయాలు గురించి వివరిస్తూ ఈ నివేదికను రూపొందించారు.
'క్రిమినల్ గ్యాంగ్ చేతిలో చిత్ర పరిశ్రమ - కోర్కెలు తీరిస్తేనే నటిగా అవకాశం' - రిపోర్ట్ - Justice Hema Committee Report
Published : Aug 19, 2024, 7:48 PM IST
Justice Hema Committee On Malayalam Film Industry : మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ తన నివేదికలో తెలిపింది. వాళ్లు కోరిన కోరికలను తీరిస్తేనే అవకాశాలు వచ్చే పరిస్థితి నెలకొందని పేర్కొంది. చిత్ర పరిశ్రమ గురించి అధ్యయనం చేసిన హేమ కమిటీ నివేదికను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది.
నివేదికలోని కీలక విషయాలు
- లైంగిక కోరికలు తీర్చకపోతే సినిమాల్లో అవకాశం ఉండదు.
- చిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తులు మత్తు మందులు సేవించి, నటీమణుల ఇళ్ల తలుపులు కొట్టిన సందర్భాలు ఉన్నాయి.
- ఇలాంటి కేసుల్లో ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఉన్నారు.
- ఎవరైనా నటీమణులపై కోపం ఉంటే వారికి శిక్షగా ఎక్కువగా రిపీట్ షాట్లు ఇస్తారు. ఓ నటికి ఒకే షాట్ను 17 సార్లు చేయించి వేధించారు.
- విపరీతంగా పురుష అహంకారం ఉంది.
- వాళ్లు అడిగినట్లుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్న మహిళలను కోడ్ పేర్లతో పిలుస్తారు.
- ఏదైనా ఉద్యోగం చేయాలి, సినిమాల్లో నటించాలనే ఆశతో ఉన్న మహిళలు రాజీ పడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి.
- కుటుంబ సభ్యులకు ముప్పు వాటిల్లుతుందని, ప్రాణాలకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధితులు బయటకి రావడం లేదు.
- చిత్ర పరిశ్రమలో కనిపించే దాన్ని అసలు నమ్మవద్దు. ఉప్పు కూడా చక్కెరలా కనిపిస్తోంది.
- మలయాళ చిత్ర పరిశ్రమ క్రిమినల్ గ్యాంగ్ నియంత్రణలో ఉంది.
2017లో ఓ నటిపై లైంగిక వేధింపులకు సంబంధించి నటుడు దిలీప్పై కేసలు నమోదైన తర్వాత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మలయాళం చిత్ర పరిశ్రమలో నటీమణులపై లైంగిక వేధింపులు, లింగ అసమానత సమస్యలపై అధ్యయనం చేయానికి జస్టిస్ హేమ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. అయితే జస్టిస్ హేమ కమిటీ తన రిపోర్ట్ను 2019లో ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై మలయాళ చిత్ర నిర్మాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నివేదిక విడుదల ఆగిపోయింది. తాజాగా సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ను విడుదల చేయాలని ఆశ్రయించిన మీడియా కార్యకర్తలతో పాటు ఐదుగురు వ్యక్తులకు ఈ నివేదికను అందజేశారు.