Delhi CM Rekha Gupta Cabinet : దేశ రాజధాని నగరం దిల్లీలో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం మంత్రులకు శాఖలు కేటాయించింది. గురువారం మధ్యాహ్నం సీఎంగా రేఖాగుప్తా, ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.. తాజాగా మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. సీఎం రేఖా గుప్తా తన వద్ద ఆర్థిక, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, సమాచార ప్రసారాల శాఖలు ఉంచుకోగా పార్టీ సీనియర్ నేత ఆశీస్ సూద్కు హోం, విద్య, విద్యుత్, పట్టణాభివృద్ధి శాఖలను అప్పగించారు.
- పర్వేశ్ వర్మ - పీడబ్ల్యూడీ, నీరు, శాసనసభ వ్యవహారాలు, నీటిపారుదల, వరద నియంత్రణ బాధ్యతలు
- ఆశిష్ సూద్ - హోం, విద్యుత్, పట్టణాభివృద్ధి, విద్య శాఖలు
- కపిల్ మిశ్రా - లా అండ్ జస్టిస్, కార్మిక, ఉపాధి, పర్యటక శాఖలు
- మంజీందర్ సింగ్ సిర్సా - పరిశ్రమలు, అటవీ, పర్యావరణం, ఆహారం, సరఫరా శాఖలు
- పంకజ్ సింగ్ - ఆరోగ్యం, రవాణా, సమాచార, సాంకేతిక శాఖలు
- రవీందర్ ఇంద్రజ్ - సామాజిక సంక్షేమం, ఎస్సీ & ఎస్టీ సంక్షేమం, కోఆపరేటివ్ అండ్ ఎలక్షన్స్
దిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలుకు నిర్ణయం
తొలిసారి సమావేశమైన దిల్లీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దిల్లీలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం అమలుకు ఆమోదం తెలిపింది. తొలి అసెంబ్లీ సమావేశంలోనే పెండింగ్లో ఉన్న 14 కాగ్ నివేదికలను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేఖాగుప్తా మీడియాతో మాట్లాడారు. గత ఆప్ సర్కార్ దిల్లీలో ఆరోగ్య పథకాన్ని అనుమతించకుండా ప్రజల ప్రయోజనాలను అడ్డుకుందని విమర్శించారు.
అయితే రేఖా గూప్త తన సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం, బాధ్యతలు స్వీకరించడం, తొలి క్యాబినెట్ భేటీ నిర్వహణ మొదలైన పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. తొలుత పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా వంటి సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, శాలిమార్బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖాగుప్తాను అధిష్ఠానం ఎంపిక చేయడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంలో ఆమెకు సామాజిక వర్గంతో పాటు, బీజేపీ కొనసాగిస్తున్న కొత్త ఒరవడి, నిర్దేశించుకున్న పలు అంశాలు అదృష్ట రేఖగా మారాయని చెప్పవచ్చు.
మహిళలకు పెద్దపీట
బీజేపీ దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళా సాధికారత గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. ఇదే అంశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా దిల్లీ సీఎం కుర్చీని రేఖా గుప్తాకు అప్పగించింది. గతంలో బీజేపీ నుంచి ఎంఎల్ ఖురానా (పంజాబీ), సాహెబ్ సింగ్ (జాట్), సుష్మా స్వరాజ్ (బ్రాహ్మణ) వంటి నేతలు సీఎంలుగా పనిచేశారు. కనుక ఇప్పుడు దిల్లీలో బలంగా ఉన్న వైశ్య వర్గానికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలనే బీజేపీ అగ్రనాయకత్వం అనుకోవడం కూడా ఆమెకు కలిసొచ్చిందనే వాదన బలంగా వినబడుతోంది. దీనికి తోడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేరు. ఈ లోటును భర్తీ చేసేందుకుగాను పార్టీ అధిష్ఠానం రేఖాగుప్తా వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది.
రేసులో ఎంతమంది ఉన్నా?
దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ నేత విజేందర్ గుప్తా సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అగ్రనాయకత్వం నిర్దేశించుకున్న అంశాలు పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల ఆయనకు స్పీకర్ పదవిని అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. రేఖా గుప్తా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నేత కావడం, ఆమెలో సంస్థాగత, నాయకత్వ నైపుణ్యాలను అధిష్ఠానం గుర్తించడం, దిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా క్యాంపస్ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉండడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆమెకు సీఎం పగ్గాలు అప్పగించినట్లు జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది.