Telangana High court Serious On HYDRA : నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కు విరుద్ధంగా వెళితే దాన్ని రద్దు చేసి హైడ్రాను మూసివేయడానికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైడ్రాను అడ్డుపెట్టుకుని కొంత మంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు. కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా తేలుస్తారని, హక్కులు నిర్ణయించే అధికారం ఎక్కడుందని నిలదీసింది. నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వడానికి తగిన గడువు ఇవ్వాలంది. చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అంటూ ప్రశ్నించింది.
ఓ వ్యక్తి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముతంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్ను కూల్చి వేయడాన్ని సవాలు చేస్తూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. 2023 నవంబరు 15న పంచాయతీ అనుమతులు మంజూరు చేసిందన్నారు. పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన అనుమతులను రద్దు చేశారని హైడ్రా తరపు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు.
గతంలో బెదిరించి అనుమతులు తీసుకున్నారని వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాతే హైడ్రా చర్యలు చేపట్టిందన్నారు. సుప్రీం కోర్టు కూడా రోడ్లకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని బుల్డోజర్ల కేసుల్లో చెప్పిందన్నారు. ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్టపరమైన ప్రక్రియ ద్వారా చర్యలు చేపడుతున్నామనగా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. తాను 20కిపైగా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశానని అయినా పిటిషన్లు వస్తూనే ఉన్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని ఎలా చెబుతున్నారన్నారు.
హైడ్రా భుజాలపై తుపాకీ పెట్టి పేల్చుతున్నారు : 2023లో అనుమతులు మంజూరు చేస్తే 2025లో ఎలా రద్దు చేస్తారు? ఇన్నేళ్లు ఏం చేశారని న్యాయమూర్తి నిలదీశారు. గత విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులను ఎందుకు సమర్పించలేదన్నారు. పార్కు స్థలాన్ని కబ్జా చేశారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టామంటున్నారని అదే అసోసియేషన్ హైడ్రా రాక ముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. పార్కు ఆక్రమణ జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. హైడ్రా భుజాలపై తుపాకీ పెట్టి పేల్చుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పార్కు స్థలంలోకి వచ్చారని ఎలా చెబుతున్నారని దాన్ని నిర్ణయించడానికి మీరెవరని హైకోర్టు నిలదీసింది. హక్కులను నిర్ణయించాల్సింది సివిల్ కోర్టు అన్న విషయం తెలియదా అంటూ ప్రశ్నించింది. ఇక్కడ లేఅవుట్కు అనుమతులను సర్పంచ్ మంజూరు చేశారని ఆ అధికారం సర్పంచ్కు ఎక్కడుందన్నారు. పిటిషనర్ను కబ్జాదార్లుగా ఎలా పేర్కొంటారని హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ను హైకోర్టు నిలదీసింది. కబ్జాదారనే నిర్వచనం ఎక్కడుందని కబ్జాదారుగా నిర్ణయించడానికి మీరేవరని ప్రశ్నించింది. తాను పిటిషనర్ను సమర్థించడంలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం పిటిషనర్కు చెందిన స్థలంలో యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశిస్తూ విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు.