Published : Dec 15, 2023, 4:13 PM IST
పిల్లలకు కథలు చదివి వినిపించిన తల్లిదండ్రులు- చైనా రికార్డ్ బ్రేక్
Parents Telling Stories Children In Pune : పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేందుకు పుణె కార్పొరేషన్, నేషనల్ బుక్ ట్రస్ట్ సంయుక్తంగా ఓ కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమంలో 3066 మంది చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొని చిన్నారులకు కథలు వినిపించారు. దీంతో గతంలో 2200మందితో కథలు చెప్పించిన చైనా రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఈ క్రమంలో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటు దక్కించుకుంది. మహారాష్ట్ర పుణెలోని ఎస్పీ స్టేడియంలో ఈ కార్యక్రమం డిసెంబరు 14న జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
పుణె మున్సిపల్ కార్పొరేషన్, నేషనల్ బుక్ ట్రస్ట్ సంయుక్తంగా పుణె బుక్ ఫెస్టివల్ నిర్వహించాయి. 3066మంది చిన్నారులకు వారి తల్లిదండ్రులు పక్కనే కూర్చుని కథలు చదివి వినిపించారు. అలాగే ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాలను పాడారు చిన్నారులు, వారి తల్లిదండ్రులు. 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు చేశారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో పిల్లలకు కథలు చెప్పడం బాధ్యతగా భావించాలని చిన్నారి తల్లి ఒకరు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత కథలు చెప్పడం ఆనందంగా ఉందని అన్నారు. పిల్లలకు కథలు చెప్పడంలో చైనాను అధిగమించి గిన్నిస్ రికార్డు సాధించడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి అభినందనలు తెలిపారు.