Food Processing Units : మీరు పారిశ్రామిక వేత్త కావాలనుకుంటున్నారా? పచ్చళ్లు చేయండి, పిండి మరలు పెట్టుకోండి, పసుపు కొమ్ములు, మిరప పొడులుగా కొట్టండి, పప్పుల మిల్లులూ పెట్టుకోండి, మినీ రైస్ మిల్, ఆక్వా ఆధారిత ఉత్పత్తులు, పశువుల దాణా తయారు చేయండి. మీరు ఏం చేద్దామన్న మీకు అండగా మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం వంద శాతం భరోసా కల్పిస్తుంది. అంతేకాదు ఆర్థికంగానూ ప్రోత్సహం అందిస్తుంది. అయితే ఆ పథకం పేరేంటి? అర్హతల వివరాలు, ఎలా అప్లై చేయాలని అనుకుంటున్నారా? అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పారిశ్రామికవేత్తగా మారాలంటే కావాల్సిందల్లా ఒకటే. మీరు ఆసక్తిగా ముందడుగు వేయడమే. 10 శాతం పెట్టుబడి, రాణించేందుకు కృషి ఉంటే చాలు మీరే మరో పది మందికి ఉపాధి కల్పించవచ్చు. అంతేకాదు ఉత్పత్తుల నాణ్యత ఆధారంగా మీకంటూ ఒక బ్రాండ్నూ సృష్టించుకోవచ్చు. ఇప్పటికే యూనిట్లు ఉన్నా, రుణం తీసుకొని వాటిని విస్తరించుకోవచ్చు.
రాయితీలు ఇలా : మీ యూనిట్కు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం (పీఎంఎఫ్ఎంఈ) కింద 35 శాతం రాయితీ (గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు) ఇస్తుంది. అలాగే బ్యాంకు రుణం 55 శాతం అందేలా చేస్తుంది.
పొదుపు సంఘాల మహిళలకు ప్రోత్సాహకాలు : పొదుపు సంఘాల్లో ఉండే మహిళలకు ఒక్కొక్కరికీ రూ.40 వేల చొప్పున సాయం అందిస్తారు. ఆ నగదును ముడి సరకు, ప్యాకింగ్, ఇతరత్రా పెట్టుబడిగా ఉపయోగించుకొని ఆ తర్వాత పొదుపు సంఘానికి చెల్లించవచ్చు. వీరు కూడా 35 శాతం రాయితీపై రుణం తీసుకొని యూనిట్ను విస్తరించుకోవచ్చు.
దరఖాస్తు చేయడం :
- జిల్లా స్థాయిలోని రిసోర్స్ పర్సన్స్ ద్వారా వివరాలు తీసుకోవచ్చు. https://pmfme.mofpi.gov.in/pmfme/#login లో యూనిట్ వివరాలతో దరఖాస్తు చేయాలి.
- ఆహారశుద్ధి పథకాల కోసం తెలంగాణ వెబ్సైట్ చిరునామా https://tgfps.telangana.gov.in/pmfme/ వివరాలకు 81210 09155
ఈ పత్రాలు ఉంటే సరిపోతుంది :
- ఆధార్ కార్డు
- పాన్కార్డు
- యూనిట్ చిరునామా ధ్రువీకరణ పత్రం (విద్యుత్, వాటర్, ఫోన్, గ్యాస్ బిల్)
- యూనిట్ నిర్వహించే భవనం లేదా భూ యాజమాన్య ధ్రువీకరణ పత్రం
- గత ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్
- యంత్రాలు
- షెడ్కు సంబంధించిన కొటేషన్లు అప్లోడ్ చేయాలి.
ఇలా దరఖాస్తు ప్రాసెస్ చేస్తారు : మీరు పంపే దరఖాస్తును రిసోర్సు పర్సన్ పరిశీలించి జిల్లా కమిటీకి సిఫారసు చేస్తారు. అక్కడ కలెక్టర్ అధ్యక్షతన ఉండే ఈ కమిటీ యూనిట్ వివరాలను పరిశీలించి బ్యాంకుకు పంపిస్తారు. రుణ చరిత్ర బాగుంటే బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఆ తర్వాత 3 నెలల్లో రాయితీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది.
యూనిట్ వ్యయం - వచ్చే నగదు :
1. యూనిట్ వ్యయం : రూ.5 లక్షల లోపు ఉంటే
వెజ్, నాన్వెజ్ పచ్చళ్లు, పిండి మరలు, పసుపు, మిరప, మసాలా పొడులు, పూతరేకులు, కొబ్బరి బర్ఫి, కొబ్బరిపొడి, రొట్టెలు, అరటి చిప్స్, కేక్స్, దోశలు, ఇడ్లీ పిండి తయారీ, అప్పడాలు, ప్యాకింగ్. ఒడియాలు, ఫ్లేవర్డ్ మిల్క్, వేరుసెనగ చెక్క, సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు సహా ఎలాంటివైనా పెట్టుకోవచ్చు.
2. యూనిట్: రూ. 5 లక్షలు - 10 లక్షలు ఉంటే
చాక్లెట్లు, వంట నూనెలు, ఛీజ్, పన్నీరు, నూడుల్స్, సేమియా, చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తులు, జెల్లీ, చపాతీ, పండ్ల జామ్, పరోటా, పశువుల దాణా తయారీ, అరటి పొడి, మిల్లెట్ ఫ్లేక్స్, డీహైడ్రేటెడ్ ఫ్రూట్ పౌడర్, అల్లం - వెల్లుల్లి పేస్టు, నన్నారి, పానిపూరీ తయారీ కేంద్రాలను పెట్టుకోవచ్చు.
3. యూనిట్: రూ.10 లక్షలు- 20 లక్షలు ఉంటే
పప్పు మిల్లులు, మినీ ధాన్యం, సాస్, జెల్లీ, తేనె శుద్ధి, కెచప్, ఇన్స్టెంట్ ప్రీమిక్స్(గులాబ్జాం, కేక్లు, ఖీర్), ప్యాకింగ్, నూనెల తయారీ, కొబ్బరి పాలు, చిరుధాన్యాల ఆధారిత ప్రాథమిక ఆహార శుద్ధి యూనిట్లు వంటివి పెట్టవచ్చు.
4. యూనిట్: రూ.20 లక్షలు- 35 లక్షలు ఉంటే
చపాతి, పరోటా, ఐస్క్రీమ్, స్క్వాష్లు, మిల్లెట్ పాస్తా, రవ్వ, పిండి యూనిట్లు, కొబ్బరినీటి సీసాలు, సోయా ప్రాసెసింగ్, పిల్లల పోషకాహారం, ఫ్రూట్ బార్స్ తదితరాలను పెట్టవచ్చు.
5. యూనిట్: రూ.35లక్షల నుంచి రూ.50లక్షలు, ఆపైన ఉంటే
పశువుల దాణా, కాఫీ ప్రాసెసింగ్, లెమన్ ప్రాసెసింగ్, ప్రొబయోటిక్ డ్రింక్స్, మాంసం, చేపలు ప్రాసెసింగ్, చెరకు ఆధారిత బెల్లం, సిరప్ తయారీ, మిల్క్ చిల్లింగ్, పండ్ల రసాల యూనిట్, మొక్కజొన్న ఉత్పత్తులు తదితరాలు పెట్టుకోవచ్చు.