Banished Woman Returns To Village After 35 Years : 35 ఏళ్ల క్రితం గ్రామ బహిష్కరణ.. అధికారుల చొరవతో సొంతూరుకు మహిళ.. పూలమాలలతో ఘనస్వాగతం - కర్ణాటక రామనగర్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Oct 6, 2023, 10:53 AM IST
Banished Woman Returns To Village After 35 Years : గ్రామ బహిష్కరణకు గురైన ఓ మహిళ 35 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి చేరుకుంది. అధికారులు చొరవ తీసుకుని గ్రామస్థులను ఒప్పించి.. మహిళను గ్రామానికి తీసుకొచ్చారు. ఈ సంఘటన కర్ణాటక.. రామనగర్ జిల్లాలోని అగర్ గ్రామంలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
అగర్ గ్రామానికి చెందిన సకలమ్మ 35 ఏళ్ల క్రితం గ్రామ బహిష్కరణకు గురైంది. జరిమానా కడితే గ్రామంలో ఉండవచ్చని ఆదేశించారు పంచాయతీ పెద్దలు. కానీ ఆమె జరిమానా కట్టలేకపోవడం వల్ల గ్రామ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల వార్తాపత్రికల్లో సకలమ్మ బహిష్కరణ వార్తలు వచ్చాయి. ఈ విషయం ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరింది. అప్పుడు అగర్ గ్రామస్థులతో తహసీల్దార్ విజియన్న, సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జయప్రకాశ్, ఇతర అధికారులు సమావేశమయ్యారు. గ్రామ బహిష్కరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. సకలమ్మకు విధించిన గ్రామ బహిష్కరణను తొలగించేందుకు గ్రామస్థులను ఒప్పించారు. సకలమ్మను తన స్వగ్రామానికి రప్పించారు. ఆమెకు గ్రామస్థులు, అధికారులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హరోహళ్లి ఎస్ఐ నటరాజన్ సైతం పాల్గొన్నారు.
గ్రామ బహిష్కరణ నేరమని అన్నారు తహసీల్దార్ విజియన్. గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పు చేయకూడదనే ఉద్దేశంతో గతంలో పెద్దలు గ్రామ బహిష్కరణ వంటి నియమాలు పెట్టారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.
'35 ఏళ్లు క్రితం ఓ కారణంతో గ్రామం నుంచి బహిష్కరించారు. గ్రామపంచాయతీ విధించిన జరిమానా కట్టలేకపోవడం వల్ల గ్రామం నుంచి వెళ్లిపోయా. నా సమస్య వార్తాపత్రికలో వచ్చింది. అప్పుడు అధికారులు చొరవ తీసుకుని గ్రామస్థులను ఒప్పించడం వల్ల స్వగ్రామానికి చేరుకున్నా.' అని సకలమ్మ తెలిపారు