How to Make Dindigul Mutton Biryani : సండే వచ్చిందంటే మెజార్టీ పీపుల్ ఇంట్లో నాన్వెజ్ ఘుమఘుమల వాసన రావాల్సిందే. నాన్వెజ్లో మటన్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులోనూ మటన్ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటారు. అందుకే ఈ రెసిపీ కోసం హోటల్స్,రెస్టారెంట్స్కు వెళ్లి మరీ తింటుంటారు. అయితే, ఇకపై అక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కేవలం నిమిషాల్లో మటన్ బిర్యానీ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన మటన్ బిర్యానీ బోర్ కొడుతుంది. అందుకే ఈసారి వెరైటీగా తమిళనాడు స్పెషల్ దిండిగల్ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది. మామూలు మటన్ బిర్యానీ కన్నా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
- మటన్ - 1 కిలో
- నీళ్లు - ఒకటిన్నర కప్పులు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- పసుపు - 1 / 2 టీస్పూన్
- ఎండుకారం - 1 టేబుల్ స్పూన్
- కల్లు ఉప్పు - రుచికి సరిపడా
- నిమ్మకాయ - 1
- పెరుగు - 200 గ్రాములు
- పుదీనా ఆకులు - గుప్పెడు
- కొత్తిమీర తరుగు - గుప్పెడు
- జీరగ సంబ బియ్యం - 2 కప్పులు
- అరటి ఆకు - 1
మసాలా పొడికి కావలసిన పదార్థాలు
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- జీడిపప్పులు - 10
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- రాతి పువ్వు - 1 1 / 2 టేబుల్ స్పూన్లు
- యాలకులు - 6
- మిరియాలు - 1 టేబుల్ స్పూన్
- బిర్యానీ ఆకులు - 2
- అనాస పువ్వు - 2
- దాల్చిన చెక్క - అర ఇంచ్
- జాపత్రి - 2
- లవంగాలు - 10
- జాజికాయ - కొద్దిగా
- సోంపు గింజలు - 1 టేబుల్ స్పూన్
మసాలా పేస్ట్ కోసం:
- చిన్న ఉల్లిపాయలు - 15
- పచ్చిమిరపకాయలు - 5
- వెల్లుల్లి రెబ్బలు - 5
- అల్లం ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
- మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి ఒకటిన్నర కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి.
- మటన్ ఉడికేలోపు మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మిక్సీజార్లోకి ధనియాలు, జీడిపప్పులు, జీలకర్ర, రాతి పువ్వు, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, జాజికాయ, సోంపు గింజలు వేసి మెత్తగా పొడి చేసుకుని ఓ బౌల్లోకి తీసుకోవాలి.
- మసాలా పేస్ట్ కోసం మరో మిక్సీ జార్లోకి చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి మెత్తటి పేస్టులాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ప్రెషర్ కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయేంతవరకు పక్కన ఉంచాలి. ఆవిరి పోయిన తర్వాత మూత తీసి మటన్ ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మటన్ ఉడికించిన నీటిని పక్కన పెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి నూనె, నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ముందే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయి రంగు మారే వరకు కలుపుతూ వేయించుకోవాలి.
- మసాలా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి మూడు టేబుల్ స్పూన్లు, పసుపు, కారం, ఉప్పు వేసి లో ఫ్లేమ్లో వేసి మసాలాలు వేయించుకోవాలి.
- మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టిన మటన్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులోకి నిమ్మకాయ రసం, పెరుగు వేసి మరోసారి బాగా కలపాలి.
- కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఆపై అందులోకి మటన్ ఉడికించగా మిగిలిన నీటిని పోసుకుని కలిపి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 25 నిమిషాలు ఉడికించాలి.
- ఈలోపు ఓ గిన్నెలోకి జీరగ సంబా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- మటన్ చక్కగా ఉడికిన తరువాత నానబెట్టిన బియ్యాన్ని మటన్ మిశ్రమంలో వేసి, రెండు కప్పుల వేడి నీళ్లు పోసి కలపాలి. ఆపై మూతపెట్టి మీడియం ఫ్లేములో పది నిమిషాల పాటు బియ్యాన్ని ఉడికించాలి.
- 10 నిమిషాల తర్వాత బిర్యానీ గిన్నెను పక్కన పెట్టి, స్టవ్ మీద మందపాటి, వెడల్పు కలగిన పెనం పెట్టుకోవాలి.పెనం వేడెక్కిన తర్వాత బిర్యానీ గిన్నెను పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఈ మటన్ మిశ్రమాన్ని మరోసారి కలిపి దానిపైన కొద్దిగా నెయ్యి, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి, బిర్యానీని అరిటాకుతో కవర్ చేసుకోవాలి. ఆపై బిర్యానీ గిన్నెను ఫాయిల్ పేపర్తో మూసేసి, కదలకుండా ఓ ప్లేట్ పెట్టాలి.
- లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు బిర్యానీని దంలో ఉడికించాలి. అంతే, దిండిగల్ మటన్ బిర్యానీ రెడీ. దీన్ని వేడివేడిగా రైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది.
చలికాలంలో అద్దిరిపోయే "మటన్ పాయ సూప్" - ఇలా చేసుకొని జుర్రితే రుచితో పాటు ఆరోగ్యం బోనస్!
మటన్ త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి - ఎంత ముదిరినా చక్కగా ఉడికిపోద్ది!