Ind vs Ire 3rd T20 : వర్షం కారణంగా ఆగిపోయిన మూడో టీ20.. 2-0 తేడాతో సిరీస్ భారత్ కైవసం - ind vs ire weather
Ind vs Ire 3rd T20 : భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0 తో భారత్ కైవసం చేసుకుంది.
![Ind vs Ire 3rd T20 : వర్షం కారణంగా ఆగిపోయిన మూడో టీ20.. 2-0 తేడాతో సిరీస్ భారత్ కైవసం Ind vs Ire 3rd T20](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2023/1200-675-19342140-thumbnail-16x9-ind-vs-ire-3rd-t20.jpg?imwidth=3840)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Aug 23, 2023, 11:00 PM IST
|Updated : Aug 24, 2023, 7:15 AM IST
Ind vs Ire 3rd T20 : యంగ్ ప్లేయర్స్తో కూడిన టీమ్ఇండియాకు నిరాశ. ఐర్లాండ్తో టీ20 సిరీస్ క్లీన్స్వీప్ చేద్దామని ఆశించిన వారికి వరుణడు అడ్డుగా నిలిచాడు. ఐర్లాండ్పై మొదటి రెండు టీ20లను సొంతం చేసుకున్న బుమ్రా సేన.. మూడో టీ20లోనూ గెలిచి క్లీన్స్వీప్ చేద్దామనుకుంది. కానీ వరుణుడు బ్రేక్ వేశాడు. దీంతో ఈ మ్యాచ్ ఒక్క బంతీ కూడా పడకుండానే ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా మారడం వల్ల మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా బుమ్రాసేన 2-0 విజయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆతిథ్య జట్టును క్లీన్స్వీప్ చేయాలన్న బుమ్రా సేన కోరిక నెరవేరలేదు.
IND VS IRE Rain : డబ్లిన్లో మ్యాచ్ ప్రారంభ సమయానికి ముందు నుంచే వర్షం మొదలైపోయంది. ఎంత సేపు అయినా అస్సలు తగ్గలేదు. ఇక టాస్ కూడా వేయకుండానే ప్లేయర్సు, అంపైర్లు చాలాసేపు ఎదురు చూసినా చివరికి ఫలితం లేకపోయింది. మ్యాచ్ ప్రారంభ సమయం నుంచి పడిన వర్షం.. మూడు గంటల తర్వాత ఆగింది. దీంతో కవర్లు బయటికి తీసినప్పటికీ.. మైదానం బాగా తడిగా తయారై ఆటకు అనువుగా లేకుండా పోయింది. అందుకే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
IND VS Ireland T20 Series 2023 Scorecard : మొదటి టీ20 కూడా వర్షం వల్ల మధ్యలో ఆగింది. దీంతో ఆ మ్యాచ్లో టీమ్ఇండియా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టీ20 మ్యాచ్ టీమ్ఇండియా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాదాపు 11 నెలల తర్వాత ఈ సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసిన బుమ్రా.. కెప్టెన్గా వ్యవహరించడమే కాకుండా.. మంచిగా బౌలింగ్ ప్రదర్శన కూడా చేశాడు. రెండు మ్యాచ్ల్లో రెండేసి వికెట్ల చొప్పున తీసి ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్లో అతడు వికెట్లు తీయడం భారత్కు అతి పెద్ద సానుకూలాంశం. ఇక బుమ్రా లాగే గాయం నుంచి కోలుకుని.. ఈ సిరీస్తో టీ20 అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ కృష్ణ కూడా మంచి ప్రదర్శన చేయడం విశేషం. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా మంచిగా రాణించాడు. మరో అరంగేట్ర ప్లేయర్ రింకూ సింగ్.. రెండో టీ20లో అవకాశాన్ని ఉపయోగించుకుని మెరుపు ఇన్నింగ్స్ ఆడి మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ మంచిగా రాణించారు.