పుదుచ్చేరి కొత్త ఎల్జీగా మాజీ ఐపీఎస్! - UPSC member Bhim Sain Bassi
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఐపీఎస్ అధికారి భీమ్ సైన్ బస్సీని నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

దిల్లీ పోలీస్ విభాగం మాజీ కమిషనర్ భీమ్ సైన్ బస్సీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం యూపీఎస్సీలో సేవలందిస్తున్న ఆయన పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. పదవీ విరమణ తర్వాత ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఈ అంశంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న అనిల్ బైజాల్ స్థానంలో బస్సీని నియమించే అంశాన్నీ కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు అధికారులు. అయితే ఇప్పటివరకు ఏ విషయం ఖరారు కాలేదని చెప్పారు. ప్రస్తుతం దిల్లీ పోలీస్ కమిషనర్గా ఉన్న ఎస్ఎన్ శ్రీవాస్తవతో బస్సీకి సత్సంబంధాలు లేవని ఉన్నతాధికారులు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
కిరణ్ బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగించిన తర్వాత.. ఆ స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు.
కేజ్రీ సర్కార్తో విభేదాలు
1977 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన బస్సీ అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-కేంద్రపాలిత ప్రాంతాల(ఏజీఎంయూటీ) కేడర్కు ఎంపికయ్యారు. దిల్లీ పోలీస్ కమిషనర్గా 2013 ఆగస్టు నుంచి 2016 ఫిబ్రవరి వరకు సేవలందించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంతో విభేదాలు ఎదురయ్యాయి. దేశద్రోహం కేసులో జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ అరెస్టు విషయంలో బస్సీ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్తో 'పెట్రో బాదుడు'పై మమత నిరసన