వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - విద్యుత్ ప్రాజెక్టులపై న్యాయవిచారణకు సీఎం ఆదేశం - మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఛాలెంజ్
Telangana Assembly Sessions 2023 Live News Today : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. విద్యుత్కు సంబంధించిన మూడు అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 4:47 PM IST
Telangana Assembly Sessions 2023 Live News Today : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. విద్యుత్కు సంబంధించిన మూడు అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తామని తెలిపారు. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా విచారణ జరపాలన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆ సవాల్ను స్వాగతిస్తున్నామన్నారు.
Judicial Inquiry On Telangana Power Sector Financial Situation : వాస్తవాలను సభ ముందు ఉంచి చర్చించేందుకు తొమ్మిదిన్నరేళ్లలో గత ప్రభుత్వం ముందుకు రాలేదని రేవంత్ పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని పూర్తిస్థాయిలో స్కాన్ చేసి సభ ముందుంచామని తెలిపారు. గత ప్రభుత్వం తప్పులను అవగాహన రాహిత్యంతో చేసిందా లేక ఉద్దేశపూర్వకమా అనేది విచారణలో తేలుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అత్యవసరమంటూ టెండర్లు లేకుండానే ఛత్తీస్గఢ్తో గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభలో వాడీవే'ఢీ' చర్చ - రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్
Minister Komatireddy On Yadadri Plant Corruption : మరోవైపు మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మధ్య సైతం వాడివేడిగా చర్చ సాగింది. టెండర్ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister KomatiReddy VenkatReddy) ఆరోపించారు. గత ప్రభుత్వం పదవీ విరమణ చేసిన వారిని సంస్థలో నియమించి, డబ్బులు దోచేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎప్పుడూ ఇవ్వలేదని అన్నారు. సబ్స్టేషన్లలో లాగ్ బుక్లు చూస్తే ఇదంతా తెలుస్తుందని చెప్పారు. తాను వెళ్లిన తర్వాత లాగ్ బుక్లు లేకుండా చేశారన్న మంత్రి కోమటిరెడ్డి రూ.10,000 కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టే నష్టాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Jagadish Reddy Demands Judicial Inquiry : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి (JagdishReddy) స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామని చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందించామని తెలిపారు. తమ హయాంలో అర ఎకరం కూడా ఎండలేదని జగదీశ్రెడ్డి వెల్లడించారు.
అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు : విద్యుత్పై ధర్నాలు చేసే అవకాశం తాము ఇవ్వలేదని జగదీశ్రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క రోజు కూడా పవర్ హాలిడే ఇవ్వలేదని చెప్పారు. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ అప్పులు ఉన్నాయని, అప్పులు ఉన్నంత మాత్రాన చెడ్డవాళ్లమా అని ప్రశ్నించారు. అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విద్యుత్ రంగంలో అవినీతిపై న్యాయ విచారణ జరిపిస్తామని అన్నారు.