Hotels Serving Contaminated Food to Devotees: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని కొన్ని హోటళ్లు భక్తులకు కలుషిత ఆహారాన్ని అందిస్తున్నాయి. వంటల్లో మోతాదుకు మించి రంగులు వాడటం, పురుగులు పట్టిన సరకులను ఉపయోగిస్తున్నట్లు అధికారుల సోదాల్లో బయటపడింది. గత నెలలో ఆహార భద్రత తనిఖీ అధికారులు తిరుపతిలోని కొన్ని హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 36 నమూనాలు సేకరించగా అందులో మొత్తం 14(38.8%) శాంపిళ్లు సరిగ్గా లేవని గుర్తించారు. వీటిల్లో 6 నమూనాలు హానికరమని పరీక్షల్లో వెల్లడికాగా 8 నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని తేలింది.
తిరుపతికి తరలివచ్చే లక్షల మంది భక్తుల రద్దీకి తగినట్లు తిరుపతి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో వేల హోటళ్లు వెలిశాయి. వీటిల్లో తయారయ్యే ఆహారం ఎలా ఉంటుందన్న దానిపై అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటోంది. తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో కల్తీ జరగడంతో తిరుపతిలో ఉన్న హోటళ్ల నాణ్యతా ప్రమాణాలపైనా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించి వచ్చిన ఆదేశాల మేరకు తనిఖీలు జరిగాయి.
సేకరించిన నమూనాలు: వివిధ హోటళ్ల నుంచి నెయ్యి, తందూరీ చికెన్, బ్లాక్ పెప్పర్, బెల్లం, జీడిపప్పు, గోబీ-65, మైసూర్పాక్, కందిపప్పు, చికెన్ ధమ్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, చికెన్ పకోడా, వేరుసెనగ పప్పు, కారం, ఆవకాయ పచ్చడి ఇలా 36 రకాల నమూనాలు సేకరించారు.
'నిన్ను ఇక్కడ పెట్టిందెవరు?' - టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతు పురాణం
ల్యాబ్ టెస్టింగ్ ఫలితాలు:
- హానికరమైనవి: 6
- నాణ్యత లోపించినవి: 8
నువ్వుల్లో పురుగులు, బెల్లంలో కృత్రిమ రంగులు: చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్, గోబీ-65, బెల్లంలో రంగులు వాడుతున్నట్లు నమూనాల పరీక్షల ద్వారా తేలింది. తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ నూనెలు, నాణ్యత లేని కారం, మసాలాలు, రసాయనాలు, కృత్రిమ రంగులు ఎక్కువగా వినియోగించే ఫుడ్ ట్రక్లు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ రంగుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తెల్ల నువ్వుల నమూనాను సేకరించగా అందులో పురుగులు ఉన్నట్లు తేలింది. వంటల తయారీకి నాసిరకం వేరుసెనగ పప్పు వాడుతున్నట్లు గుర్తించారు. ఓ హోటల్ నుంచి సేకరించిన నెయ్యి నమూనాలో నూనె ఉన్నట్లు తేలింది. దీనిని తింటే జీర్ణ సమస్యలు, ఎలర్జీ, తీవ్ర శ్వాసకోశ సమస్యలూ వచ్చే ప్రమాదముంది.
చర్యలకు సిద్ధమైన అధికారులు: హానికర ఆహార పదార్థాలు తయారు చేసిన హోటళ్లపై కోర్టుల్లో అధికారులు కేసులు వేయనున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్ల యాజమాన్యాలకు జరిమానాలు వేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.
తిరుమల దర్శనాల స్కాం - టీటీడీ ఛైర్మన్ పేరుతో NRI భక్తులకు వల
తిరుమల శ్రీవారి అన్నప్రసాద ట్రస్టుకు భారీ విరాళం - ఎన్ని కోట్లంటే?