ISRO Chairman on Gaganyaan Mission: భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి తెర లేచింది. భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్పై కీలక విషయాలను ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. గగన్యాన్ మిషన్ పూర్తి చేయడమే ఇస్రో తక్షణ కర్తవ్యం అని ఈవీటీ భారత్కు చెందిన అనుభా జైన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
మరోవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గగన్యాన్ మిషన్ను 2026లో లాంఛ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మొదట మానవరహిత (మనుషులు లేని) మిషన్ను ఈ ఏడాది లాంఛ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో వ్యోమిత్ర రోబోట్ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ఈ మానవసహిత (మనుషులు ఉన్న) అంతరిక్ష ప్రయాణ మిషన్ గగన్యాన్పై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ మిషన్లో సవాళ్లను, వాటిని ఎదుర్కొనేందుకు అంతరిక్ష సంస్థ చేస్తున్న ఏర్పాట్లపై ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్రో ముందుగా మొత్తం మూడు మానవరహిత టెస్ట్ ఫ్లైట్లను ప్రారంభిస్తుందని తెలిపారు. మానవరహిత ఫ్లైట్ టెస్టింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత మానవసహిత మిషన్కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదటి ఫ్లైట్ ఈ ఏడాది శ్రీహరికోట నుంచి లాంఛ్ చేసేందుకు షెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు.
ఈ గగన్యాన్ మిషన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను 400 కి.మీ భూమి అత్యల్ప కక్ష్య (LEO) కు పంపించడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇందుకోసం ఈ మిషన్ హ్యూమన్-రేటెడ్ LVM 3 వెహికల్ (HLVM 3)ను ఉపయోగించుకుంటుందని అన్నారు. ఈ వెహికల్ అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ అండ్ టెర్మినల్ మార్జిన్లతో పాటు విశ్వసనీయతను మెరుగుపరచడానికి ఇంక్రీజ్డ్ రిడెండెన్సీని కలిగి ఉంటుందని వివరించారు. దీంతోపాటు ఇందులో రియల్-టైమ్ వెహికల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, సిబ్బంది భద్రత కోసం ఆర్బిటల్ మాడ్యూల్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ సేఫ్టీ సిస్టమ్ వంటివి ఉన్నాయని తెలిపారు.
ఈ వెహికల్ వ్యోమగాములను మొదట 170కి.మీ, ఆ తర్వాత అక్కడి నుంచి 400కి.మీ భూమి అత్యల్ప కక్ష్య వరకు తీసుకుని వెళ్తుందని వెల్లడించారు. ఈ విధంగా కక్ష్యను మెయింటెన్ చేస్తూ ఆ తర్వాత వ్యోమగాములను సురక్షితంగా తిరిగి భూమికి చేరుస్తుందని ఇస్రో ఛైర్మన్ వివరించారు.
ఈ మిషన్లో భాగంగా ఇది సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ ఆరోహణ, అవరోహణ రెండింటినీ నిర్వహిస్తుందని అన్నారు. ఇది రీ-ఎంట్రీ సమయంలో దాని వేగాన్ని తగ్గిస్తుందని, ఆ తర్వాత పారాచూట్ సహాయంతో దీని ల్యాండింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మిషన్ కోసం పారాచూట్లను DRDO సహాయంతో ఆగ్రాలో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ అండ్ టెర్మినల్ మార్జిన్స్ అంటే?: అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ అండ్ టెర్మినల్ మార్జిన్స్ చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని వ్యోమగాముల భద్రతలో సహాయపడతాయి. అంటే అధిక వేగంతో ఒక వస్తువు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు అది గణనీయమైన వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకుని వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు ఇస్రో ఈ అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ అండ్ టెర్మినల్ ప్రొటెక్షన్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. అనంతరం అంటే చివరి దశలో ఈ స్పేస్క్రాఫ్ట్ను పారాచూట్లను ఉపయోగించి ఖచ్చితమైన, నియంత్రిత వేగానికి నెమ్మదించి ల్యాండింగ్ చేయనున్నారు.
ఇంక్రీజ్డ్ రిడెండెన్సీ అంటే ఏంటి?: ఇంక్రీజ్డ్ రిడెండెన్సీ అంటే ఒక వ్యవస్థ విఫలమైతే అప్పుడు దాని బ్యాకప్ వ్యవస్థ సిద్ధంగా ఉంటుంది.
మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే?: గగన్యాన్ మిషన్లో సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి తీసుకునిరావడంలో ఉపయోగపడుతుంది. అంటే అంతరిక్ష నౌక భూ వాతావరణానికి తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రొపల్షన్ సిస్టమ్ దాని వేగాన్ని తగ్గిస్తుంది. ఆ తర్వాత పారాచూట్ సాయంతో ఈ స్పేస్క్రాఫ్ట్ను నెమ్మదిగా సేఫ్ ల్యాండింగ్ చేయనున్నారు.
ఈ విధంగా మానవసహిత (మనుషులు ఉన్న) అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్లో సవాళ్లను పరిష్కరించి వాటిని ఎదుర్కొనేందుకు ఇస్రో చేస్తున్న పగడ్బందీ ఏర్పాట్లపై నారాయణన్ వివరించారు. దీంతోపాటు ఈ గగన్యాన్ మిషన్ తర్వాత తక్కువ ఖర్చుతో కూడిన అంతరిక్ష ప్రయాణంపై ఇస్రో దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. అంటే ఇస్రో అటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో రాకెట్లను అభివృద్ధి చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా తక్కువ ఖర్చుతో స్పేస్క్రాఫ్ట్లను లేదా ఆస్ట్రానాట్స్ను అంతరిక్షంలోకి పంపించొచ్చని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష సంస్థ ఇప్పటికే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ (LUPEX)తో సహా అనేక మిషన్లకు ఆమోదం పొందినట్లు నారాయణన్ తెలిపారు. ఇస్రోకు ఇది ఒక ప్రత్యేక మిషన్ అని, ఇది చంద్రయాన్-3 గణనీయమైన మెరుగుదలగా అభివర్ణించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను జపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు నారాయణన్ తెలిపారు.
ఏంటీ LUPEX మిషన్?: లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ (LUPEX) అనేది చంద్రుని ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి భారత్, జపాన్ అంతరిక్ష సంస్థలు చేపట్టిన ఉమ్మడి మిషన్. ఇది చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించి, భవిష్యత్తులో చంద్రుని అన్వేషణకు కొత్త మార్గాలను తెరుస్తుంది. ఇలా ఈ మిషన్ చంద్రునిపై మన అవగాహనను మరింత మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ నేపథ్యంలో LUPEX మిషన్ శాస్త్రీయ ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన అడుగును సూచిస్తుందని నారాయణన్ అన్నారు.
మరోసారి చంద్రుడిపైకి వెళదామా?- చంద్రయాన్-4పై క్లారిటీ వచ్చిందిగా!
చరిత్ర సృష్టించిన ఇస్రో- అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
సాంకేతికతలో విప్లవ మార్పులు- అంతరిక్షంలో 'పురుడు' పోసుకున్న జీవం!- ఇస్రో మరో ఘనత