Case on Kurnool 49th ward YSRCP Corporator: బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేయాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఓ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బెదిరింపులకు దిగాడు. ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటుకు సిద్ధం కాగా రూ. 5 లక్షలు ఇవ్వాలని లేకుంటే అంతుచూస్తానని హెచ్చరించారు. దీంతో కార్పొరేటర్ నుంచి రక్షణ కల్పించాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.
డబ్బులివ్వకుంటే అంతుచూస్తా: కర్నూలు బీ క్యాంపునకు చెందిన మద్దెల విజయ్రాజ్ బ్యాడ్మింటన్ శిక్షకుడిగా జీవనం సాగిస్తున్నారు. ఆయన సుంకేసుల రోడ్డులో 11 సెంట్ల స్థలాన్ని లీజుకు తీసుకుని బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్లిన నిందితుడు తాను స్థానిక కార్పొరేటర్నని, తన అనుమతితోపాటు నగరపాలక సంస్థ అనుమతి తీసుకోకుండా కోర్టు ఎలా ఏర్పాటు చేసుకుంటావని ప్రశ్నించాడు. రూ.5 లక్షలు ఇస్తే అన్ని అనుమతులు ఇప్పిస్తానని నిందితుడు విజయ్రాజ్తో చెప్పాడు.
తాను అంత ఇచ్చుకోలేనని రూ.లక్ష మాత్రం ఇస్తానని చెప్పగా చివరికి రూ.4 లక్షలు ఇవ్వాల్సిందేనని కార్పొరేటర్ హుకుం జారీ చేశాడు. విజయ్రాజ్ అంత ఇచ్చుకోలేక అనుమతుల కోసం నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 24వ తేదీన బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేస్తుండగా కార్పొరేటర్ అక్కడికెళ్లి నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. బాధితుడు పలువురిని విచారించగా కృష్ణకాంత్ స్థానిక వార్డు కార్పొరేటర్ కాదని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కర్నూలు 2వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు బీఎన్ఎస్126(2), 351(2), 308(3) సెక్షన్ల కింద కృష్ణకాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మోతాదుకు మించిన రంగులు - పురుగు పట్టిన సరకులు - ప్రజల ప్రాణాలతో చెలగాటం
'నిన్ను ఇక్కడ పెట్టిందెవరు?' - టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతు పురాణం