LIVE : శ్రీవారి బ్రహ్మోత్సవాలు - వైభవంగా సాగుతున్న చక్రస్నానం
Published : 2 hours ago
Srivari Brahmotsavam 2024 LIVE : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుని వాహన సేవలు కన్నులపండుగగా సాగాయి.పెద్దశేష వాహనంతో ప్రారంభమైన వాహనసేవలు అశ్వవాహనంతో ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు ఉదయం, రాత్రి వేళల్లో రోజుకోక వాహనంపై తిరుమాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శ్రవణా నక్షత్రాన అర్చావతారంలో స్వామి వారు భూలోకంలో అవిర్బవించడంతో ఈ రోజును ఎంతో పుణ్యదినంగా భావిస్తారు. దీంతో కన్యామాసం శ్రవణా నక్షత్రం రోజున అవభృత స్నానం నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు, చక్రతాళ్వారులను వరహస్వామి వారి ముఖ మండపానికి తీసుకొచ్చిన అనంతరం ఉభయదేవేరులతో నున్న శ్రీవారి సరసన చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పవిత్ర జలాలతో, పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. అవభృత స్నానంతో చక్రతాళ్వార్లకు స్వామివారి పుష్కరణిలో చక్రస్నానం నిర్వహిస్తున్నారు. ఈ చక్రస్నానం జరిగిన రోజున పుష్కరణిలో భక్తులు స్నానాలు చేస్తే సకలమైన పాపాలు తొలగి పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.రాత్రి ఏడు గంటలకు ఉభయదేవేరుల సమేతుడైన మలయప్ప స్వామి బంగారు తిరుచ్చిపై నాలుగు మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య నివేదనతో పాటు వివిధ వైదిక కార్యక్రమాల అనంతరం బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ధ్వజస్థంభంపై ఎగురవేసిన ధ్వజపటాన్ని కిందకు దించే ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహిస్తారు..