దీపావళికి వంటింట్లో 'మహాశక్తి' వెలుగులు - అప్పటి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ - Free LPG Cylinder Scheme - FREE LPG CYLINDER SCHEME
AP Govt Free Gas Cylinder Scheme : ఏపీ ప్రజలకు పండుగ ముందే కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పర్వదినం నుంచే అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు పంపిణీ చేస్తామన్నారు.


Published : Oct 3, 2024, 12:22 PM IST
AP Govt Free Gas Cylinder Scheme : ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మహాశక్తి పథకం కింద పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ నుంచి అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కసరత్తు ప్రారంభించింది.
విధి విధానాలపై కసరత్తు : అనంతపురం జిల్లాలో మొత్తం 12,54,911 గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో దీపం, ఉజ్వల పథకాల కింద, ఇతర ప్రభుత్వ పథకాల కింద తీసుకున్న వారిలో తెల్లకార్డుదారులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తే 12,08,293 మంది కార్డుదారులున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణాల్లో ఉచిత వంట గ్యాస్ పథకం అమలవుతోంది. ఇందుకోసం ఏడాదికి ఎంత ఖర్చవుతోంది? ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు? విధి విధానాలపై పౌర సరఫరాలశాఖ కసరత్తు చేసి నివేదిక సిద్ధం చేసింది. శాసనసభ కమిటీలో మంత్రులు కూడా చర్చించి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి విధివిధానాలను వెల్లడించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
12.54 లక్షల కనెక్షన్లు : ఉమ్మడి జిల్లాలో మొత్తం 12,54,911 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డుదారుల ప్రాతిపదికగా తీసుకుంటే ఇందులో 96 శాతం అంటే 12,08,293 కుటుంబాలకు పథకానికి అర్హత ఉంది. వీరందరికీ ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలంటే రూ.105,06,10,763.50 ఖర్చవుతుంది.
ఏడాదికి ఒక్కో ఫ్యామిలీకి రూ.2,608 : సూపర్ సిక్స్ పథకాల హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు చంద్రబాబు ప్రకటించారు. అనంతపురంలో తాజాగా ఒక్కో గ్యాస్ సిలిండరు ధర రూ.869.50 ఉంది. మూడు సిలిండర్ల లెక్కన ప్రస్తుతమున్న వంట గ్యాస్ ధర ప్రకారం ఒక్కో ఫ్యామిలీకి ఏడాదికి రూ.2,608.50 ప్రయోజనం చేకూరుతుంది.
దీపం పథకం కింద : మహిళలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించేందుకు 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడే దీపం పథకాన్ని ఏపీలో ప్రారంభించారు. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో 4,09,764 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సిలిండర్కు రూ.869.50 చొప్పున ఏడాదికి రూ.35,62,89,798 భరించాల్సి ఉంటుంది. వీటితో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇంధన కంపెనీలకు సంబంధించి 68,451 కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడింటికి రూ.5,95,18,144.50 వెచ్చించాల్సి ఉంది.
ప్రధానమంత్రి ఉజ్వల పథకం : ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో 28,478 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్పై రూ.300 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు రాయితీ ఇస్తోంది. అంటే వీరికి ఒక్కో గ్యాస్ సిలెండర్పై రూ.569.50 చొప్పున రాయితీ ఇవ్వాలి. మూడింటికి ఏడాదికి రూ.2,47,61,621 అవుతుంది.
ఈకేవైసీ వేగవంతం : ఏపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్ల పంపిణీ ప్రకటించింది. ఆయా ఏజెన్సీల కింద ఉన్న వినియోగదారులకు డీలర్లు సమాచారం చేరవేశారు. గ్యాస్ ఏజెన్సీల వద్దకు ఆధార్ కార్డు తీసుకెళ్లి బయోమెట్రిక్ వేయించుకుంటున్నారు. గ్యాస్ వినియోగదారులంతా ఈకేవైసీ చేసుకుంటే జిల్లాలో అసలైన గ్యాస్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయన్నది తెలుస్తుందని ప్రముఖ గ్యాస్ డీలరే చెప్పడం గమనార్హం.
రూ.500కే గ్యాస్ సిలిండర్పై క్లారిటీ వచ్చేసింది - ముందుగా మొత్తం ధర చెల్లించాలి, ఆ తర్వాత!