తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 8:44 AM IST

Updated : Jun 7, 2024, 9:06 AM IST

ETV Bharat / state

రేపే బత్తిని బ్రదర్స్​ 'చేప ప్రసాదం' పంపిణీ - నాంపల్లి గ్రౌండ్​లో 1200 మందితో పోలీసుల బందోబస్తు - CHEPA MANDU DISTRIBUTION IN HYDERABAD 2024

Chepa Mandu in Hyderabad 2024 : చేప ప్రసాదం పంపిణీ శనివారం నాడు నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన మందును సిద్ధం చేశామని బత్తిని కుటుంబీకులు తెలిపారు. మరోవైపు చేప మందు కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 1200 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Fish Prasadam Distribution 2024
Fish Prasadam Distribution 2024 (ETV Bharat)

Arrangements in Fish Prasadam Distribution 2024 :మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా చేప ప్రసాదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా అవసరమైన మందును సిద్ధం చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ దూద్‌బౌలిలోని వారి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రత్యేక వాహనంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానానికి తీసుకొస్తారు.

Police Security Chepa Mandu in Hyderabad : సుమారు ఆరు లక్షల మందికి సరిపడా చేప ప్రసాదం మందును సిద్ధం చేశామని బత్తిని అమర్‌నాథ్‌గౌడ్‌ పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎగ్జిబిషన్‌ మైదానంలో, అనంతరం కవాడీగూడ, దూద్‌బౌలిలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. 180 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఏటా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తుండడం విశేషం.

షెడ్లలో 2000 మంది :మరోవైపు చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది ఉబ్బసం వ్యాధిగ్రస్థులకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుంటున్నారు. వారు అక్కడ ఏర్పాటు చేసిన షెడ్లలో ఉంటున్నారు. వారికి స్వచ్ఛంద సంస్థలు భోజనం, అల్పాహారం, తాగునీరు అందిస్తున్నారు. చేప మందును తీసుకుంటే శ్వాసకోశ ఇబ్బందులు ముఖ్యంగా ఆస్తమా వంటి సమస్యలు తగ్గిపోతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. అలాగే వివిధ శాఖల అధికారులు సమన్వయంతో మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

32 కౌంటర్ల ఏర్పాట్లు :ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ అజంతా గేటు నుంచి లోపలికి ప్రజలను అనుమతిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్యలో నుంచి చేప ప్రసాదం కోసం వరుసలో వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా టోకెన్లు తీసుకోవాలి. చేప ప్రసాదం పంపిణీకి మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేయనున్నారు.

1200 మంది పోలీసులతో బందోబస్తు : చేప ప్రసాదం పంపిణీని పురస్కరించుకొని సుమారు 1200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు అబిడ్స్‌ ఏసీపీ ఆకుల చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. మైదానంలో పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని అన్నారు. సిటీ సెక్యూరిటీ వింగ్, డాగ్‌ స్క్వాడ్, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లు, సీసీ టీవీలను ఏర్పాటు చేస్తామని ఏసీపీ ఆకుల చంద్రశేఖర్ వివరించారు.

సంత్‌ నిరంకారీ సత్సంగ్‌కు చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకొచ్చారని ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. రెండు 108 అంబులెన్సులు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. రెండు అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచుతున్నట్లు వివరించారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏసీపీ ఆకుల చంద్రశేఖర్ వెల్లడించారు.

Talasani About Fish Prasadam : 'ఆస్తమా రోగులకు చేప మందు చక్కటి పరిష్కారం'

చేపప్రసాదం పంపిణీకి వెళ్తున్నారా? - మీ కోసమే తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు - Special Buses For Fish Prasadam Distribution 2024

Last Updated : Jun 7, 2024, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details