Dhoolpet drug peddler Anguri Bai Arrested : హైదరాబాద్ ధూల్పేటలోని యతీంఖానా ప్రాంతానికి చెందిన అంగూరీబాయి ఒకప్పుడు సాధారణ గృహిణి. కుటుంబం గుడుంబా వ్యాపారం చేసినా ఆమె ఎన్నడూ చేయిపెట్టలేదు. 2015 రాష్ట్ర ప్రభుత్వం ధూల్పేటలో గుడుంబా విక్రయాలను ఆపేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఆ తర్వాత ఈ కుటుంబానికి చెందిన కొందరు డబ్బు కోసం గంజాయి విక్రేయించేవారు. ఈ క్రమంలోనే అంగూరీ బాయి ఇంటి దగ్గరే ఉంటూ గంజాయి గ్రాముల్లో అమ్మకాలు ప్రారంభించింది. ఇలా తొలిసారి 2017లో ఆబ్కారీ అధికారులకు చిక్కింది. 460 గ్రాముల గంజాయి మాత్రమే దొరకడంతో స్టేషన్ బెయిలు ఇచ్చి పంపించారు.
ఆ తర్వాత 2019 వరకూ ఈమెపై మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. అప్పటి వరకూ సాధారణ గంజాయి విక్రేతగా ఉన్న అంగూరీ బాయి, కొవిడ్ తర్వాత గంజాయి దందాలో అంచెలంచెలుగా ఎదిగింది. కుటుంబం మొత్తం ఈ దందాలో ఉండడంతో అంగూరీ బాయి చిన్నాచితకా విక్రయాలు మానేసి పెద్ద మొత్తంలో విక్రయించే స్థాయికి చేరింది. స్థానికంగా కొందరు అధికారులు సహకరించడం, చూసీచూడనట్లు వదిలేయడంతో నెట్వర్క్ను పెంచుకుంది. ఒక్క ఆబ్కారీ శాఖ అధికారులే ఈమెపై 25 కేసులు నమోదు చేశారు. ఇవిగాకుండా పోలీసు కేసులు ఉంటాయని, వాటిపైనా ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆరు రాష్ట్రాలకు గంజాయి సరఫరా : అంగూరీభాయి అరెస్టుతో హైదరాబాద్లో గంజాయి విక్రయాలు తగ్గే అవకాశముందని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారంటే ఏ స్థాయిలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ సహా తెలంగాణలో గంజాయికి డిమాండ్ పెరగడాన్ని అంగూరీ బాయి బాగా సొమ్ము చేసుకుంది. వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసే సిండికేట్లో ఒకరిగా మారింది. ఎప్పుడూ చుట్టూ నలుగురు బౌన్సర్ల తరహాలో అంగరక్షకులుగా ఉంటారు. ఈ అక్రమ వ్యాపారంతో వేర్వేరు ప్రాంతాల్లో మూడు ఫాంహౌజ్లతో పాటు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కూడగట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆరు రాష్ట్రాలకు ఈమె గంజాయి సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.