Producer Bunny Vasu visits Sree Tej at KIMS : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. 2 నెలలుగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో బాలుడు చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బాలుడు శ్రీతేజ్కు అందుతున్న చికిత్స గురించి వివరాలను బన్నీ వాసు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్తామని బన్నీ వాసు తెలిపారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులు భరిస్తామని వివరించారు.
శ్రీతేజ్ ఆరోగ్యంపై ప్రకటన విడుదుల : " శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికే పరిమతమయ్యాడు.కొన్ని రోజుల పాటు శ్రీతేజ్కు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆ తర్వాత సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్ను తొలగించి ప్రత్యేక గదికి మార్చారు. అప్పటి నుంచి శ్రీతేజ్ ఆసుపత్రిలోని బెడ్కే పరిమితమయ్యాడు. పేరు పెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడటం లేదు. నోరు విప్పి ఏం మాట్లాడలేడు. ఇప్పటి వరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు.
వైద్య సిబ్బంది ఆ చిన్నారి కోలుకోవడానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. అతడు ఎప్పుడు కోలుకుంటాడనే విషయం వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండటం లేదు" అని కిమ్స్ వైద్యులు డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు : సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తర్వాత బాలుడిని పక్కకు తీసుకెళ్లిన పోలీసులు సీపీఆర్ చేసి వెంటనే సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీనికి ప్రభుత్వం స్పందించి బాలుడికి చికిత్స అందిస్తుంది. సినిమా ప్రముఖులు సైతం సాయం చేశారు. ఎన్ని చేసినా శ్రీతేజ్ మాత్రం ఎప్పుడు కోలుకుంటాడో మళ్లీ బడికి ఎప్పుడు వెళతాడో, డాన్స్ ఎప్పుడు చేస్తాడో అని అతని తండ్రి, చెల్లెలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప -2 తొక్కిసలాట ఘటనకు 56 రోజులు - ప్రస్తుతం శ్రీతేజ్ ఎలా ఉన్నాడో తెలుసా?