KTR Tweet on Vattem Pump House : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం రేవంత్రెడ్డి కంప్యూటర్ల మూలాధారాలు కనిపెట్టి మళ్లీ ఆవిష్కరిస్తున్నారని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. దిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై, సీఎం తన విధులు విస్మరిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు.
తక్షణమే నీరు తొలగించాలి : సెప్టెంబరు 3వ తేదీన పాలమూరు- రంగారెడ్డి నీటి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంపుహౌస్లో వరదలు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఘటనలో బాహుబలి మోటార్లు నీట మునిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యవసరమైనప్పటికీ, ఇప్పటి వరకు కేవలం ఒక మీటరు నీరు మాత్రమే తొలగించారని, మరో 18 మీటర్ల మేర తక్షణమే నీరు తొలగించాలని ఆయన సూచించారు. నీటిని తొలగించని పక్షంలో పంప్లు పాడయిపోయే ప్రమాదం ఉందన్నారు. 'మిస్టర్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు ముఖ్యమైన ప్రతి దాన్ని నాశనం చేయడానికి మీరు ఎందుకు నరకయాతన పడుతున్నారో సమాధానం ఇవ్వండి?' అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
దేశంలో మొదటి అగ్రి ఇంక్యుబేటర్ : మరోవైపు అగ్రిహబ్లను కొనియాడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి, బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్లౌడ్, డ్రోన్ల, వంటి అధునాతన సాంకేతికలతో రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపడానికి అగ్రిహబ్లు ఉపయోగపడుతున్నట్లు ఆయన తెలిపారు. వీటిని 2021 ఆగస్టులో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం స్థాపించిందని గుర్తు చేశారు.