తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుడే భగ్గుమంటున్న ఎండలు - మొదలైన కరవు - నీటికోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు

Drinking Water Problem In Mahabubnagar : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా తయారైంది మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ అధికారుల తీరు. మిషన్‌ భగీరథ, పురపాలక శాఖల మధ్య సమన్వయ లోపంతో ప్రజలు నీటి కోసం కోటి తిప్పలు పడాల్సి వస్తోంది. రెండు వారాలుగా తాగునీటి సరఫరాలో అధికారుల తీరు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 2:57 PM IST

Water Problem in Jadcherla
Water Problem In Mahabubnagar

DrinkingWater Problem In Mahabubnagar : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 80 వేలకు పైగా జనాభా నివసిస్తుంది. ఈ మున్సిపాలిటీ పరిధిలో వేసవి ప్రారంభంతోనే ప్రజలకు మంచి నీటి కష్టాలు (Water Problem) ప్రారంభమయ్యాయి. బిందెడు నీటి కోసం నల్లాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. మల్లెబోయిన్‌పల్లి నుంచి కావేరమ్మపేట ఓవర్ హెడ్ ట్యాంకుకు నీటిని సరఫరా చేసే మూడు పంపులు ఇటీవల మరమ్మతులకు గురయ్యాయి.

మిషన్ భగీరథవిభాగం అధికారులు ఒక పంపును మాత్రమే మరమ్మతు చేసి మిగతా రెండింటిని వదిలేశారు. అప్పటినుంచి ఒక దానితోనే కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో కావేరమ్మ పేట హౌసింగ్ బోర్డు పరిథిలోని పలు కాలనీల్లో వారం రోజులుగా మంచినీరు సరఫరా కావడం లేదు. కొన్ని ప్రదేశాల్లో పైపులైను లీకేజీ కారణంగా నీరు వృధా పోతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు.

"నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ 40 కుటుంబాలు ఉన్నాయి. నీళ్ల ట్యాంకర్లు లేక అనేక అవస్థలు పడుతున్నాం. నీళ్లు 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అవికూడా ఇంటికి పది బిందలు మాత్రమే వస్తున్నాయి. నీళ్లు లేకపోవడం వలన కనీస అవసరాలు తీర్చుకోలేక పోతున్నాం. నీటి సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యలు తీర్చాలి. " - స్థానికులు, జడ్చర్ల మున్సిపాలిటీ

Drinking Water Problems: గొంతెండుతున్న శివారు కాలనీలు.. అధికారుల అలసత్వంతో జనం అవస్థలు

JadcherlaDrinkingWater :జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో నీటి విషయంలో మిషన్ భగీరథ విభాగం, పురపాలిక శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది. నీటి సరఫరాలో ఆటంకాలపై ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారే తప్ప నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం లేదు. కొన్ని ఏరియాలో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమయానికి నీళ్లు రావడం లేదు.

రోజుకు కొన్ని ఏరియాలకు మాత్రమే నీటిని వదలడంతో మరి కొన్ని ఏరియాలకు నీటి ఎద్దడి తప్పడం లేదు. దాంతో పాటు ఇండస్ట్రియల్ ఏరియాలో గత కొంతకాలంగా 50 నుంచి 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఏరియాలో గతంలో రెండు మిషన్ భగీరథనల్లాలు బిగించారు. అప్పట్లో మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తుండేవి. కానీ ఇప్పుడు 15 రోజులకు ఒకసారైనా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న తమని కరుణించే నాధుడే లేరంటూ మహిళలు విలపిస్తున్నారు. నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను తీర్చాలని అధికారులను కోరుతున్నారు.

Drinking Water Problem in Sangareddy : పక్కనే మంజీరా.. కానీ తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కరవాయే!

Drinking Water Problem in Nalgonda : తాగునీటి కోసం నెల రోజులుగా నరకయాతన.. పట్టదా వారి ఆవేదన..

ABOUT THE AUTHOR

...view details