Cricket Match Live At Wedding Hall : భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అనగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ఈ మ్యాచ్ ప్రాధాన్యతను గుర్తించిన ఓ వరుడు (పెళ్లి కుమారుడు) తన స్నేహితుల కోసం పెళ్లి మండపంలోనే మ్యాచ్ లైవ్ చూసేందుకు ఏర్పాట్లు చేశాడు. దీంతో వివాహ వేడుకకు వచ్చిన అతిథులతో పాటు వరుడి స్నేహితులు కూడా మ్యాచ్ను వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు.
'దాయాదుల' పోరును ప్రత్యక్ష ప్రసారం :పూర్తి వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామానికి చెందిన మస్కరి మణిశర్మ, సాయి ప్రియల వివాహ వేడుక ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. అయితే ఆదివారం భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ఉండటంతో దాని ప్రాధాన్యతను గుర్తించిన వరుడు క్రికెట్ మ్యాచ్ లైవ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే మండపంలో వివాహ వీడియో వీక్షించాల్సిన తెరపై 'దాయాదుల' పోరును ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేందుకు తెరను ఏర్పాటు చేశారు. అటు స్నేహితుడి వివాహ వేడుకను ఇటు ఉత్కంఠ భరితంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ను ఒకే ప్రాంగణంలో చూడటం ఆనందంగా ఉందని పెళ్లి కుమారుడి స్నేహితులు తెలిపారు.
"ఈ రోజు మా ఫ్రెండ్ వివాహం జరిగింది. ఇదే రోజు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉండటం వల్ల పెళ్లికి వచ్చినటువంటి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా స్నేహితుడు ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్పై మేమంతా క్రికెట్ మ్యాచ్ లైవ్ను చూశాం. ఓ వైపు మా ఫ్రెండ్ వివాహాన్ని మిస్సవ్వకుండా మరోవైపు క్రికెట్ మ్యాచ్ను కూడా చూడటం చాలా ఆనందాన్నిచ్చింది"- నిఖిల్, వరుడి స్నేహితుడు