Hyderabad Metro MD NVS Reddy on Future City Metro Rail Project : ప్యూచర్ సిటీ మెట్రో కారిడార్కు సంబంధించిన సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్యూచర్ సిటీ వరకు కొనసాగుతున్న మెట్రో సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ల వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయని, ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నది సీఎం సంకల్పం అని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఎండీఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. దాదాపు పదిహేను వేల ఎకరాలలో విస్తరించనున్న భవిష్య నగరిని కాలుష్య రహిత నగరంగా రూపొందించడంతో పాటు, దానికి అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తాం : ఎయిర్ పోర్ట్ నుండి మీర్ ఖాన్ పేట్లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారీకై జరుగుతున్న సర్వే పనులను ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటనలో పరిశీలించారు. డీపీఆర్ కోసం జరుగుతున్న సర్వే పనులపై సంబంధిత అధికారులకు మెట్రో ఎండీ అనేక సూచనలు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందని, అది ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుండి మొదలై, కొత్తగా ఏర్పాటు కాబోయే మెట్రో రైల్ డిపో పక్క నుండి ఎయిర్ పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్ పల్లి రోడ్డుమీదుగా 5 కిలోమీటర్లు మెట్రో మార్గం ముందుకు సాగుతుంది. అనంతరం పెద్ద గొల్కోండ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి చేరుతుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా అక్కడ బహదూర్ గుడాలో ఉన్న దాదాపు 1,000 నుండి 1,500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్ గుడా, పెద్ద గోల్కొండలలో రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తాం : రావిర్యాల్ ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్ ఖాన్ పేట్ వరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 100 మీటర్లు (328 అడుగులు) వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రో రైల్కి కేటాయించారన్నారు. మెట్రో రైల్కి కేటాయించబడిన రోడ్ మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ ఎట్ గ్రేడ్ (భూ తలంపై) మెట్రోగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ విశాలమైన రోడ్ మధ్యలో అదే లెవెల్లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుందని, మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామని, ప్రధాన రహదారికి ఇరువైపులా మరల రెండు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
మార్చి నెలాఖరుకు పూర్తి : డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఓఆర్ఆర్ నిర్మిస్తున్నప్పుడు ఓఆర్ఆర్లో అంతర్భాగంగా భవిష్యత్లో నిర్మించబోయే మెట్రోకి తగినంత స్థలాన్ని కేటాయించాలన్న అప్పటి తన ప్రతిపాదనను వైఎస్ఆర్ అంగీకరించి ఓఆర్ఆర్లో 20 మీటర్లు మెట్రోకి కేటాయించారని ఎన్వీఎస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అనేక మంది ఓఆర్ఆర్, మెట్రో వంటి బృహత్ ప్రణాళికలు కేవలం కాగితలకే పరిమితమవుతాయని, అవి ఆచరణ సాధ్యం కాదని అపహాస్యం చేసినా, ప్రస్తుతం ఓఆర్ఆర్, మెట్రో రెండూ కూడా కార్యరూపం దాల్చాయని అయన పేర్కొన్నారు. వీటివల్ల హైదరాబాద్ ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెంది, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులతో హైద్రాబాద్కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ప్రప్రథమంగా 22 వేల కోట్ల రూపాయలతో మెట్రో మొదటి దశను 69 కిలోమీటర్ల మేర ఏవిధంగా పీపీపీ పద్ధతిన విజయవంతంగా పూర్తి చేసామో, అదే విధంగా ఈ ప్రణాళికలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతతో కార్యరూపం దాల్చేలా హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తాయన్నారు. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లతో పాటు, ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ కూడా ఈ మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వీటిని సమర్పిస్తామని తెలిపారు.
'మేడ్చల్, శామీర్పేట్ ప్రాంతాల్లో మెట్రో కారిడార్కు నెలాకరుకల్లా సర్వే పనులు పూర్తి'
హైదరాబాద్ పాతబస్తీకి మెట్రో విస్తరణ - హైకోర్టులో వ్యాజ్యం దాఖలు