AP PCC Chief YS Sharmila Letter : వైఎస్సార్ బతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో, నలుగురు గ్రాండ్ చిల్డ్రన్స్కి సమాన వాటా ఉండాలనేది ఆయన కోరికనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, వైఎస్సార్ కుమార్తె షర్మిల తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలేనని అన్నారు. అవి ఏవీ జగన్ మోహన్ రెడ్డి సొంతం కాదని.. ఆయన కేవలం గార్డియన్ మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అభిమానులకు మూడు పేజీల లేఖను రాశారు.
ఆ షర్మిల రాసిన మూడు లేఖలో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి. 'అన్ని వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టాలనేదే జగన్ బాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి మేండేట్. వైఎస్ఆర్ ఉద్దేశం ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికీ, స్పష్టంగా తెలిసిన విషయం. వైఎస్సార్ బతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో, సరస్వతి అయినా, భారతి సిమెంట్స్ అయినా, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది వైఎస్ఆర్ మాండేట్. (ఒక్క సండూరు మినహాయించి). తన తండ్రి బతుకున్నంత కాలం ఏ ఒక్క ఆస్తి పంపకం జరగలేదు. వైఎస్ హఠాత్ మరణం తర్వాత కూడా ఏ ఆస్తిని పంపకం చేయలేదు. ఇప్పటివరకు నాకు రావాల్సిన ఆస్తి కూడా రాలేదు. ఏ ఆస్తి నా చేతిలో లేదు. అని షర్మిల లేఖలో వివరించారు.
అన్నీ కుటుంబ ఆస్తులే : తన స్వార్జితం అని చెప్పుకొనే ఆస్తులు ఏవీ జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు కాదు.. అన్నీ కుటుంబ ఆస్తులే. రాజశేఖర్రెడ్డి బతుకున్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం. ఈరోజు సాక్షి పేపర్లో చూపినట్లు మా తాతల ఆస్తులు చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రానా, అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు. ఆస్తి పంచడం అంటే ఇవిగో ఈ ఆస్తులు నీకు అని ఇవ్వడం. ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటేనని వైఎస్ షర్మిల తెలిపారు.