తెలంగాణ

telangana

ETV Bharat / international

చర్చలు, దౌత్యానికే భారత్​ మద్దతు- యుద్ధానికి కాదు : ప్రధాని మోదీ

బ్రిక్స్ రెండో రోజు ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు - యుద్ధాలు, ఆర్థిక అస్థిరతలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి పలు సమస్యలపై ఆందోళన

BRICS Summit 2024 PM Modi
BRICS Summit 2024 PM Modi (ANI)

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

BRICS Summit 2024 PM Modi : భారత్​ చర్చలు, దౌత్యానికే మద్దతు ఇస్తుందని, యుద్ధానికి కాదని బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుత చర్చలతో పరిష్కరించుకోవాలని అన్నారు. రష్యాలోని కాజన్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమిట్​ రెండోరోజు ప్లీనరీ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు, ఆర్థిక అస్థిరతలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి పలు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో తీసుకువెళ్లడానికి బ్రిక్స్ సానుకూల పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

'మనమంతా కలిసి కొవిడ్‌ లాంటి సవాళ్లను అధిగమించాం. అదే విధంగా భవిష్యత్​ తరాల కోసం సురక్షిత, భద్రపరమైన జీవితాన్ని అందించేందుకు కచ్చితంగా కొత్త అవకాశాలను సృష్టించగలం. సైబర్ భద్రత, సురక్షితమైన ఏఐ కోసం అంతర్జాతీయ నిబంధనలను తీసుకొచ్చేందుకు అందరం కలిసి కృషి చేయాలి. ఉగ్రవాదానికి, తీవ్రవాదులకు నిధులు సమకూర్చడానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పని చేయాలి. ఈ విషయంలో ద్వంద్వ విధానాలకు తావులేదు. మన దేశాల్లోని యువతను అతివాదభావజాలం వైపు మరల్చే చర్యలను అడ్డుకునే విషయంలో చురుగ్గా వ్యవహరించాలి' అని ప్రధాని మోదీ సూచించారు.

'అందుకు భారత్​ సిద్ధమే'
బ్రిక్స్‌ భాగస్వాములుగా ఇతర దేశాలను ఆహ్వానించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో వ్యవస్థాపక సభ్య దేశాల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు. ఐరాస భద్రతా మండలి, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని మరోసారి గుర్తుచేశారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. విభిన్నమైన ఆలోచనాధోరణులు, భావజాల సమ్మేళనంగా ఏర్పడిన బ్రిక్స్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

ఈ సమావేశానికి ముందు బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు గ్రూపు ఫోటో దిగారు. తర్వాత ప్లీనరీకి పుతిన్‌ అధ్యక్షత వహించారు. బ్రిక్స్‌లో చేరడానికి 30 దేశాలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. కూటమి సమర్థంగా పనిచేయడాన్ని దృష్టిలో పెట్టుకొనే గ్రూపు విస్తరణపై చర్చిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. బ్రిక్స్ దేశాలు లోతైన ఆర్థిక, వాణిజ్య సహకారం పెంపొందించుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details