Modi Indian Community Event :ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ దేశానికి బలమైన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలోని భారతీయుల నైపుణ్యాలు, నిబద్ధత సాటిలేనివని కితాబిచ్చారు. వారు ఇరుదేశాలను అనుసంధానించినట్లు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్ వేదికగా నిర్వహించిన 'మోదీ& యూఎస్- ప్రోగ్రెస్ టుగెదర్' అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
గతంలో తాను ఎటువంటి పదవుల్లో లేని సమయంలోనే అమెరికాలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించినట్లు ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా అమెరికా పర్యటనల్లో భాగంగా ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఇక్కడి భారతీయులు ప్రతిసారీ పాత రికార్డులను చెరిపేశారని అభినందించారు.