భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్రికెట్ అభిమానులు టీవీల ముందుకు చేరిపోతారు. అలాంటి హైఓల్టేజ్ మ్యాచ్కు మరోసారి రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏలో భాగంగా ఇరుజట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ను ఓడించి పాకిస్థాన్ జట్టు టైటిల్ నెగ్గింది. ఈసారి అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా కోరుకుంటోంది.
డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ టోర్నీలో బరిలోకి దిగిన పాకిస్థాన్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడింది. అటు బంగ్లాదేశ్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి భారత్ రెట్టించిన ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. సెమీస్ బెర్త్పై టీమ్ఇండియా కన్నేయగా, ఈ టోర్నీలో గ్రూప్దశ నుంచే వైదొలిగే ప్రమాదం నుంచి గట్టెక్కాలని పాకిస్థాన్ జట్టు కోరుకుంటోంది. బుమ్రా లేకపోయినా టీమ్ఇండియా పేస్ దళాన్ని తొలి మ్యాచ్లో అద్భుతంగా నడిపించిన మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అతడికి హర్షిత్ రాణా తోడయ్యాడు.
స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కూడా తమ వంతు పాత్ర పోషించారు. వీరు పాకిస్థాన్పై ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. మరోవైపు దూకుడుగా ఆడుతున్న రోహిత్, శతక వీరుడు గిల్ మరోసారి చెలరేగితే, టీమ్ఇండియాకు భారీ పరుగులు ఖాయమే.
ఇదిలా ఉండగా, గతంలో పాకిస్థాన్పై గొప్ప ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ, తన మునుపటి ఫామ్ను అందుకొని రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇక పాకిస్తాన్ అంటే చెలరేగి ఆడే హార్దిక్ పాండ్యా మరోసారి సత్తా చాటాలని టీమ్ఇండియా కోరుకుంటోంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్పటేల్, రవీంద్ర జడేజాలతో భారత మిడిల్ఆర్డర్ పటిష్ఠంగా కనిపిస్తోంది. విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించడానికి బంగ్లాదేశ్తో ఆడిన జట్టుతోనే టీమ్ఇండియా ఈ మ్యాచ్లో బరిలోకి దిగనుంది.
మరోవైపు గేమ్ ఛేజింగ్ ఓపెనర్ ఫకర్ జమాన్ దూరం కావడం పాక్ జట్టుకు పెద్ద లోటే. స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ సరైన ఫామ్లో లేకపోవడం కూడా ఆ జట్టును ఇబ్బందిపెడుతోంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బాబర్ అజామ్ 90 బంతుల్లో 64 పరుగుల చేశాడు. ఒకవైపు రిక్వైర్డ్ రన్రేట్ పెరిగిపోతున్నా వేగంగా ఆడటంలో విఫలమయ్యాడు.
ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా వంటి ప్లేయర్లు న్యూజిలాండ్పై మంచి ఇన్నింగ్స్లే ఆడారు. జట్టును గెలిపించలేకపోయినా ఓటమి అంతరాన్ని బాగా తగ్గించారు. తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసిన పాకిస్థాన్కు భారత్తో మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో ఓడితే ఆ జట్టు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాల్సిందే. దాయాదుల పోరు అంటే ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాణంపెట్టి ఆడతారన్న విషయం తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో మూడుసార్లు పాకిస్థాన్ నెగ్గగా.. రెండుసార్లు భారత్ విజయం సాధించింది.
2004, 2009 ఛాంపియన్స్ ట్రోఫీల్లో భారత్పై పాకిస్తాన్ గెలుపొందింది. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై భారత్ పైచేయి సాధించింది. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లో పాకిస్థాన్పై ఘన విజయం సాధించిన భారత్ ఫైనల్లో మాత్రం ఓటమిపాలైంది. ఆనాటి ఫైనల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకొనే అవకాశం ఇప్పుడు టీమ్ఇండియాకు వచ్చింది.
గత వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ను చిత్తుగా ఓడించిన నేపథ్యంలో మరోసారి ఆ జట్టును ఓడించి సత్తా చాటాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటున్నాడు. దుబాయ్ వేదికగా దాయాదుల పోరు ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆరంభంకానుంది.