తెలంగాణ

telangana

డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగితే ఏం జరుగుతుంది? - పరిశోధనలో తేలిందిదే! - Can Diabetics Drink Alcohol

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 2:17 PM IST

Alcohol Side Effects : ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని పట్టిపీడిస్తున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ముందు వరసలో ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా దీని బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే షుగర్ లెవల్స్ అదుపులో ఉండడానికి కఠినమైన ఆహార నియమాలను పాటిస్తుంటారు. అయితే.. మధుమేహం ఉన్నవారు మద్యం తాగొచ్చా? అనేది చాలా మందికి ఉండే సందేహం. మరి, మీకు తెలుసా?

CAN DIABETICS DRINK ALCOHOL
Alcohol Side Effects (ETV Bharat)

Diabetics Can Drink Alcohol? : నేటి రోజుల్లో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది షుగర్ కంట్రోల్​లో ఉండేందుకు డైలీ మందులు వాడడమే కాకుండా కొన్ని ఆహార నియమాలను పాటిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం ఒక పక్క మందులు వాడుతూనే.. వారికీ నచ్చినట్టు తినడం, తాగడం చేస్తుంటారు. అందులో భాగంగానే.. ఆల్కహాల్ కూడా సేవిస్తుంటారు. అయితే, మధుమేహం(Diabetes)ఉన్నవారు మద్యం తాగొచ్చా? ఒకవేళ తాగితే ఏమవుతుంది? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగొచ్చా? అని అడిగితే.. ఎట్టిపరిస్థితుల్లో కూడా వారు మద్యం సేవించకూడదని అంటున్నారు జనరల్​ ఫిజీషియన్ డాక్టర్ మనోహర్. మధుమేహానికి మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లేనని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. కొందరు మాత్రం కొద్దిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్​లో ఉంటాయని అనుకుంటారని.. కానీ అది కేవలం అపోహ మాత్రమేనని సూచిస్తున్నారు.

"సాధారణంగా మధుమేహం ఉన్న వారిలో నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువ. అదే.. మద్యం(Alcohol)తాగితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఎంత ఎక్కువకాలం నుంచి డయాబెటిస్​తో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదముంది. దీని మూలంగానే చాలామంది కాళ్లు చేతుల తిమ్మిర్లు, మంట పెట్టటం, సూదులు పొడిచినట్టు అనిపించటం వంటి లక్షణాలతో ఇబ్బందిపడుతుంటారు. దీనికి ఆల్కహాల్ కూడా తోడైతే సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇంకాస్త త్వరగా నాడులు దెబ్బతినొచ్చు. కాళ్లు మొద్దుబారి, పుండ్లు పడొచ్చు. పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావొచ్చు" - డాక్టర్ ఎస్​.మనోహర్​, జనరల్​ ఫిజీషియన్.

డయాబెటిస్ ఉన్న వారు మద్యం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు డాక్టర్ మనోహర్. 2018లో 'డయాబెటిస్ కేర్ జర్నల్‌'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. షుగర్ ఉన్న వారు మద్యం సేవించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు 30 శాతం పెరిగినట్లు పరిశోధకులు కనుగొన్నారు.

షుగర్ బాధితులు - రోజూ గుడ్డు తింటే ఏమవుతుంది?

తాగాల్సివస్తే ఇలా చేయండి :

ఒకవేళ డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకోవాల్సి వస్తే.. కొద్దిగా తీసుకుని తర్వాత భోజనం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. అప్పుడు మాత్రమే మాత్రలను వేసుకోవాలంటున్నారు. అదే.. మందు తాగాక భోజనం చేయకపోతే ట్యాబ్లెట్స్ వేసుకోవద్దని చెబుతున్నారు. మద్యం సేవించాక తినడం వల్ల కొంతవరకు చక్కెర స్థాయిలు కంట్రోల్​లో ఉంటాయట. అదే.. మీరు మందు తాగిన తర్వాత భోజనం చేయకపోవడం వల్ల గ్లూకోజ్‌ లెవెల్స్‌ పడిపోయి హైపోగ్లైసీమియాకు దారితీయవచ్చంటున్నారు డాక్టర్ మనోహర్. ఈ పరిస్థితి ప్రమాదకరమని కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చని అంటున్నారు.

కాబట్టి.. మధుమేహులు వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడూ రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలంటున్నారు. అంటే.. రెగ్యులర్​గా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం, వైద్యులు సూచించిన మందులు వేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మధుమేహం​తో తీవ్రంగా బాధపడుతున్నారా? - ఇలా రోజూ చేస్తే షుగర్ పరార్!

ABOUT THE AUTHOR

...view details