తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రంప్ టారిఫ్​ల భయం! స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు- రూ.10 లక్షల కోట్లు ఉఫ్ - STOCK MARKET LIVE UPDATES

Stock Markets
Stock Markets (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2025, 11:15 AM IST

Updated : Jan 27, 2025, 12:31 PM IST

Stock Market Live Updates Jan 27th 2025 :భారత స్టాక్​ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాలతో ముగిశాయి.

LIVE FEED

3:57 PM, 27 Jan 2025 (IST)

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బలహీన కార్పొరేట్‌ త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, అమెరికా వాణిజ్య విధానంపై అనిశ్చితి వంటి కారణాలతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 900 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 23 వేల పాయింట్ల దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఓ దశలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 3 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ 4 శాతం చొప్పున కుంగాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరై రూ.410 లక్షల కోట్లకు చేరింది.

కారణాలు ఇవే..

  • అమెరికాలోని అక్రమ వలసదారులకు తిప్పి పంపే విషయంలో తొలుత కొలంబియా వ్యతిరేకించడం, దానికి ప్రతిగా 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్‌ బెదిరించడం, దాంతో కొలంబియా తన నిర్ణయాన్ని మార్చుకోవడం వంటి పరిణామాలు జరిగాయి. దేశాలను దారికి తెచ్చుకునే విషయంలో ట్రంప్‌ ఇలా బెదిరింపులకు దిగుతుండడంతో ఎప్పుడు ఏ దేశంపై ఉరుముతారోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇలాంటి హెచ్చరికలు కెనడా, మెక్సికోకు ఆయన జారీ చేసిన విషయం తెలిసిందే.
  • త్రైమాసిక ఫలితాల సీజన్‌లో వెలువడుతున్న కార్పొరేట్‌ ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో మదుపర్లు నిరాశగా ఉన్నారు. దీనికి తోడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కూడా మదుపర్లకు పెద్దగా ఆశల్లేకపోవడం మార్కెట్లలో నిరాసక్తతకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
  • అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ సారి ఎలాంటి కోతా ఉండకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే, మున్ముందు ఎలా వ్యవహరిస్తారనే విషయంలో ఫెడ్‌ నుంచి ఎలాంటి కామెంట్లు వెలువడతాయనే దానిపై మార్కెట్లు చలించే అవకాశం ఉందని అనలిస్టులు చెబుతున్నారు.
  • దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత ట్రేడింగ్‌ సెషన్‌ నాటికి (జనవరి 24) సుమారు రూ.64 వేల కోట్ల ఈక్విటీలను వారు విక్రయించడం గమనార్హం. సమీప భవిష్యత్‌లో ఈ మొత్తాలు తగ్గుతాయని గానీ, మళ్లీ కొనుగోళ్లకు దిగుతారన్న అంచనాలు గానీ లేకపోవడం మార్కెట్లో ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

1:02 PM, 27 Jan 2025 (IST)

సెన్సెక్స్​ 716 పాయింట్లు డౌన్

ప్రస్తుతం బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్​ 716 పాయింట్ల నష్టంతో 75,473 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ , 230 పాయింట్ల నష్టంతో 22, 864 వద్ద ట్రేడ్​ అవుతోంది.

12:30 PM, 27 Jan 2025 (IST)

సెన్సెక్స్​ 510 పాయింట్లు డౌన్

ప్రస్తుతం బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్​ 510 పాయింట్ల నష్టంతో 75,680 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ , 160 పాయింట్ల నష్టంతో 22, 931 వద్ద ట్రేడ్​ అవుతోంది.

11:08 AM, 27 Jan 2025 (IST)

ట్రంప్ టారిఫ్​ల భయం
దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. కొలంబియా దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో గందరగోళం నెలకొంది. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై వారి స్వదేశానికి సైనిక విమానాలను దేశంలో దిగడానికి కొలంబియా నిరాకరించింది. దీంతో ట్రంప్ ఈ చర్యలకు దిగారు. అమెరికా-కొలంబియా మధ్య వాణిజ్యం తక్కువే అయినా, మెక్సికో, యూరప్, కెనడా, చైనా వంటి ఇతర వాణిజ్య భాగస్వాములపైన ఈ టారిఫ్​ చిక్కులు ఎలా ఉంటాయనే భయం మదుపర్లలో నెలకొంది.

అంతే కాకుండా- కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు ఆశించిన మేర ఉండకపోవచ్చన్న భావనలకు తోడు, కార్పొరేట్‌ సంస్థలు ఆర్థిక ఫలితాల్లో అంతగా రాణించకపోవడం కూడా ఈ నష్టాలకు కారణంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక, తొలిసారిగా ఈనెల 28, 29 తేదీల్లో సమావేశం కానున్న ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశ నిర్ణయాలు కీలకం కానుండటం వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Last Updated : Jan 27, 2025, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details