- రతన్ టాటాకు భారతీయ అమెరికన్లు కూడా ఘన నివాళులు అర్పిస్తున్నారు. భారత అభివృద్ధికి, శ్రేయస్సుకు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. దిగ్గజ టెక్నాలజీ కంపెనీ గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ 'ఎక్స్' వేదికగా రతన్ టాటాకు ఘన నివాళులు అర్పించారు.
- యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) అధ్యక్షుడు అతుల్ కేశప్, భారతదేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని అన్నారు. రతన్ టాటా దాతృత్వానికి ఒక రోల్ మోడల్ అని కొనియాడారు.
- టాటాల వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరించి, 'టాటా'ను ఒక గొప్ప బ్రాండ్గా మార్చిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా 86 సంవత్సరాల వయస్సులో మరణించారు అని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు ప్రముఖుల ఘన నివాళి
Published : 4 hours ago
|Updated : 2 minutes ago
Ratan Tata Death LIVE Updates : దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్వయంగా ప్రకటించారు.
ప్రముఖుల సంతాపం
రతన్ టాటా మరణవార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వెళ్లారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
LIVE FEED
గొప్ప దార్శనికుడిని కోల్పోయాం : ఇండియన్ అమెరికన్స్
గొప్ప దార్శనికుడి కోల్పోయాం - బిర్లా
రతన్ టాటా మృతితో భారతదేశం, దేశ పరిశ్రమ గొప్ప దార్శనికతను కోల్పోయాయని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. దశాబ్దాలుగా టాటా, బిర్లా కుటుంబాలు అత్యంత సన్నిహితంగా కలిసిమెలసి ఉంటున్నాయని ఆయన అన్నారు. ఆదర్శ జీవితం గడిపిన రతన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు బిర్లా తెలిపారు.
అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పార్థివ దేహాన్ని కోల్బాలోని ఆయన నివాసానికి తరలించారు. తరువాత ఎన్సీపీఏ గ్రౌండ్కు ఆయనను తీసుకువెళ్లారు. ప్రజలు నివాళులు అర్పించడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ రోజు సాయంత్రం 3.30 గంటలకు అంతిమ యాత్ర నిర్వహిస్తారు. తరువాత రతన్ టాటా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.
ముంబయిలో జరగనున్న పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు సమాచారం. భారత ప్రభుత్వం తరపున టాటా భౌతికకాయానికి ఆయన నివాళులర్పించనున్నారు. ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ లావోస్కు వెళ్లనున్న నేపథ్యంలో షా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
దేశం కోసం జీవితం అంకితం!
రతన్ టాటాకు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు మొదలుకొని సినీ ప్రముఖులు వరకు అందరూ సంతాపం తెలియజేస్తున్నారు. దేశం కోసం తన జీవితాన్ని భారతదేశానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడుతున్నారు.
"భారతదేశ అభివృద్ధికి రతన్ టాటా తన జీవితాన్ని నిస్వార్థంగా అంకితం చేశారు. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ దేశం, ప్రజల అభ్యున్నతిపై ఆయన చూపించే నిబద్ధత నన్ను ఆశ్చర్యపరిచేది. ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ, మనందరి హృదయాలలో ఎప్పటికీ జీవించే ఉంటారు." - అమిత్ షా, కేంద్రహోం మంత్రి
"జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి రతన్ టాటా. ఆయన మరణవార్త విని ఎంతో బాధపడ్డాను. మూడు దశాబ్దాలుగా ఆయనతో వ్యక్తిగత, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ కల్పనకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. తన వ్యాపార చతురతకు అతీతంగా సమాజంలో ఎంతో మందిని ప్రభావితం చేసిన సామాజిక నాయకుడు’’.
- నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి
రతన్ టాటా మృతికి అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ సంతాపం తెలిపారు. "భారత్ ఒక వ్యాపార దిగ్గజాన్ని, ఆధునిక మార్గాన్ని పునర్నిర్మించిన వ్యక్తిని కోల్పోయింది. ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు. కరుణ కలిగిన వ్యక్తి. ఆయన లాంటి లెజండ్కు మరణం లేదు"
- గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్
"రతన్ టాటా నైతికతలోను, నాయకత్వంలోను, దాతృత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. ఆయన వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన జ్ఞాపకాలు మనతో ఎప్పటికీ ఉంటాయి"
- హర్ష్ గోయెంకా, ఆర్పీజీ గ్రూప్ ఛైర్పర్సన్
"రతన్ టాటా దేశానికి ఎనలేని సేవలందించారు. ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధిలో ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకం".
- ఆనంద్ మహీంద్రా
"రతన్ టాటా భారతదేశం గర్వపడే వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను."
- ఉదయ్ సురేష్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు
రతన్ టాటా మృతిపట్ల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటి ప్రియాంక చోప్రా సంతాపం వ్యక్తం చేశారు. భారత్ నిజమైన కుమారుడిని, ఛాంపియన్ను కోల్పోయిందని ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు. 'రతన్ టాటా భావితరాలకు స్ఫూర్తిదాయకం, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలకు, దేశం పట్ల ఆయనకున్న అంకిత భావానికి ధన్యవాదాలు' అని ప్రియాంక చోప్రా అన్నారు.
రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు
రతన్టాటాకు సినీ ప్రముఖులు ఘన నివాళులర్పిస్తున్నారు. ఆయన్ని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
భారతీయులకు ఇది బాధాకరమైన రోజు. సేవలో రతన్టాటాను మించినవారు లేరు. మనదేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరు. మెగా ఐకాన్. నిజమైన పారిశ్రామిక వేత్త, పరోపకారి. అసాధారణ మానవుడు. టాటా బ్రాండ్లను గ్లోబల్ పవర్ హౌస్గా నిర్మించడమే కాకుండా.. మనదేశ నిర్మాణంలోనూ అద్భుతంగా కృషి చేశారు. మనం ఒక మంచి మనస్సున్న వ్యక్తిని కోల్పోయాం. భారతీయ పారిశ్రామిక వేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు తరాలకు స్ఫూర్తినిస్తాయి.. మార్గాన్ని నిర్దేశిస్తాయి. రతన్ టాటా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా
- చిరంజీవి
"రతన్ టాటాది బంగారంలాంటి హృదయం. భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. దూరదృష్టి గల వ్యక్తి. ఎంతోమంది జీవితాలను మార్చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను"
- జూనియర్ ఎన్టీఆర్
"రతన్టాటా ఓ లెజెండ్. మన హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. టాటా ఉత్పత్తులను ఉపయోగించని రోజును ఊహించుకోవడం కష్టం. ఎన్నోతరాలకు స్ఫూర్తి. పంచ భూతాలతో పాటు ఆయన కూడా ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన ఆరాధకుడినే. జైహింద్"- రాజమౌళి, తెలుగు సినిమా దర్శకులు
"ఒక పరోపకారి. లక్షలాది మందికి ఆశాజ్యోతి. ఎంతోమందికి స్ఫూర్తి. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎంతో కృషి చేశారు. అలాంటి గొప్ప మనిషి మరొకరు ఉండరు. ఆయన ఇక లేరని ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంటోంది. మిస్ యూ సర్. ఓం శాంతి"
- ఖుష్బూ
భారతదేశ ముద్దుబిడ్డను కోల్పోయాం: కాంగ్రెస్
రతన్ టాటా మృతికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. వ్యాపారం, దాతృత్వంలో చెరగని ముద్ర వేసి వెళ్లిపోయారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రతన్ టాటా కుటుంబానికి, టాటా గ్రూప్నకు ‘ఎక్స్’లో సంతాపం తెలిపారు. టాటా మరణంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విచారం తెలియజేశారు. దేశం తన ముద్దుబిడ్డను కోల్పోయిందని ఆయన అన్నారు. రతన్ టాటా కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని, ఆయన దేశ నిర్మాణానికి వెలలేని సహకారం అందించారని కొనియాడారు.
స్ఫూర్తి ప్రదాత
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, రతన్ టాటా మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారరంగంలో రతన్ టాటా అసాధారణమైన సేవలు అందించారని పేర్కొన్నారు.
మీ ఆత్మకు శాంతి కలగాలి
రతన్ టాటా మృతి వార్తతో పారిశ్రామికవేత్తలు అందరూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అభిలషించారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సహా పలువురు భారతీయ పారిశ్రామిక వేత్తలు రతన్ టాటాకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రతన్ టాటా లేరన్నది నేను అంగీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా అన్నారు. మన దేశ ఆర్థిక సంపదకు, విజయాలకు ఆయన సేవలు ఎంతగానే ఉపయోగపడ్డాయని కొనియాడారు.
దాతృత్వంలో శాశ్వత ముద్ర : రాహుల్ గాంధీ
రతన్ టాటా మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్ టాటా శాశ్వత ముద్ర వేశారన్నారు. ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఘన నివాళి
రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ దిగ్గజ వ్యాపారవేత్తకు నివాళి అర్పిస్తూ గురువారాన్ని సంతాప దినంగా ప్రకటించింది. అలాగే రతన్ టాటా మృతికి సంతాపం తెలుపుతూ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం సంతాప దినం ప్రకటించారు.
మోదీ సంతాపం
రతన్ టాటా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త అని, ఎంతో దయగల అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. భారత్లోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు రతన్ టాటా స్థిరమైన నాయకత్వం అందించారని, మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు.
రతన్ టాటా ఒక గొప్ప మార్గదర్శి
రతన్ టాటా మృతిపట్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సంతాపం వ్యక్తం చేశారు. అత్యున్నతమైన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలకు ఆయన మార్గదర్శి అని అన్నారు.
రాష్ట్రపతి సంతాపం
రతన్ టాటా మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. భారత్ ఒక దిగ్గజ పారిశ్రామికవేత్తను కోల్పోయిందన్నారు. ఆయన చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆమె కొనియాడారు.