తెలంగాణ

telangana

అదానీ బౌన్స్ బ్యాక్​​ - దేశంలో అత్యంత సంపన్నుడిగా అవతరణ - ఒక్క ఏడాదిలోనే 95% పెరిగిన సంపద! - Adani Replaces Ambani

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 4:38 PM IST

Adani Replaces Ambani To Become Wealthiest Indian : దిగ్గజ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అదరగొట్టారు. భారత అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో అదానీ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఈ మేరకు హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్​ను విడుదల చేసింది.

Gautam Adani
Gautam Adani (Getty Images)

Adani Replaces Ambani To Become Wealthiest Indian :హిండెన్​బర్గ్ ఆరోపణలతో భారీగా ఆస్తి కోల్పోయిన దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ రాకెట్ వేగంతో దూసుకొచ్చారు. భారత్​లోని అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని మరోసారి కైవసం చేసుకున్నారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఈ మేరకు హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్​ను వెలువరించింది.

95% పెరిగిన అదానీ సంపద
హురూన్‌ ఇండియా వెలువరించిన జాబితాలో రూ.11.61 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో నిలిచారు. ఏడాది కాలంలో ఆయన సంపద ఏకంగా 95 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. రూ.10.14 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద ఏడాది కాలంలో 25 శాతం మాత్రమే పెరిగింది. రూ.3.14 లక్షల కోట్ల సంపదతో హెచ్​సీఎస్ ఛైర్మన్ శివ నాడార్ మూడో స్థానంలో, రూ.2.89 లక్షల కోట్ల ఆస్తితో సీరమ్ ఇన్​స్టిట్యూట్‌ అధినేత సైరస్‌ పూనావాలా నాలుగో స్థానంలో ఉన్నారు. రూ.2.50 లక్షల కోట్ల సంపదతో సన్​ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ ఐదో స్థానంలో నిలిచారు.

అప్పుడలా - ఇప్పుడిలా
హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023 నివేదిక ప్రకారం, అప్పట్లో గౌతమ్ అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ.4.47 లక్షల కోట్లకు పడిపోయింది. దీనితో ముకేశ్ అంబానీ సంపద రూ.8.08 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్​బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ సంపద అప్పట్లో భారీగా పడిపోయింది. 2014లో అదానీ సంపదను రూ.44,000 కోట్లుగా హురున్ అంచనా వేసింది. అప్పుడు భారత అత్యంత సంపన్ను జాబితాలో పదో స్థానంలో నిలిచారు. కానీ ఇప్పుడు భారత్​లోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు.

పిన్న వయసులో బిలియనీర్​గా నిలిచిన జెప్టో ఫౌండర్
హురూన్‌ వెలువరించిన బిలియనీర్‌ జాబితాలో జోహో కంపెనీకి చెందిన రాధా వెంబు రూ.47,500 కోట్ల సంపదతో మహిళల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. జెప్టో వ్యవస్థాపకుడైన 20 ఏళ్ల కైవల్య వోహ్రా రూ.4,300 కోట్ల సంపదతో బిలియనీర్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతి పిన్న వయసులోనే ఈ అరుదైన ఘనతను ఆయన సాధించారు. మరో సహ వ్యవస్థాపకుడు అదిత్‌ పలిచా రూ.3600 కోట్ల సంపదతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

బాద్​షా అదుర్స్
బాలీవుడ్‌ బాద్​షా షారుక్‌ ఖాన్‌ హురూన్‌ బిలియనీర్ జాబితాలో తొలిసారి చోటు సంపాదించారు. ఆయన సంపద రూ.7,300 కోట్లుగా హురూన్ నివేదిక తెలిపింది. ఈసారి ఆశ్చర్యకరంగా 16 మంది ప్రొఫెషనల్స్ బిలియనీర్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. అరిస్టా నెట్​వర్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జయశ్రీ ఉల్లాల్ రూ.32,100 కోట్లతో బిలియనీర్​గా నిలిచారు. డీమార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇగ్నేషియస్ నవిల్ నొరోన్హా రూ.6,900 కోట్లతో బిలియనీర్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details