PM Kisan Samman Nidhi Yojana :పీఎం కిసాన్ 19వ విడత నిధుల్ని సోమవారం(ఫిబ్రవరి 24న) ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన రూ.22వేల కోట్లతో 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. బిహార్లోని భాగల్పుర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ 'పీఎం కిసాన్' నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
"నేను పేదలు, అన్నదాతలు, యువత, మహిళలను ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలుగా నెలబెట్టాను. ఎన్డీఏ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం వల్లనే రైతులకు సబ్సీడీ ధరలకు యూరియా లభిస్తోంది. అంతేకాదు మా ప్రభుత్వ ప్రయత్నాల వల్లనే దేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. త్వరలోనే మఖానా (ఫాక్స్ నట్) బోర్డ్ను ఏర్పాటు చేస్తాం. ఇది బిహార్ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది."
- ప్రధాని మోదీ
'కేంద్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లతో బిహార్లో 4 కొత్త వంతెనలను నిర్మిస్తుంది. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయి. కానీ బిహార్ సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని ప్రధాని మోదీ అన్నారు.
రైతులకు వెన్నుదన్నుగా
రైతులకు ఏటా ఒక్కో విడత రూ.2,000 చొప్పున మూడువిడతల్లో రూ.6,000 సాయం అందించే 'పీఎం కిసాన్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు 18 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు అందజేసింది.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోవాలి?
- ముందుగా మీరు www.pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్లోని "Beneficiary List" ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోవాలి.
- లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయాలి. అంతే సింపుల్!
- మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు అక్కడ కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి.