Woman Gave Birth To Three Babies : ఒకే కాన్పులో ముగ్గురు పండంటి బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చిన అరుదైన ఘటన సంగారెడ్డి జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. తమకు వివాహమై ఎనిమిదేళ్లయినప్పటికీ సంతానం కలగకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనప్పటికీ ఎట్టకేలకు ముగ్గురు పండంటి బిడ్డలు జన్మించడంతో ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు శిశువులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం : సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని అడవి మసీదు గ్రామానికి చెందిన నాగరత్న - నర్సింహులుకు వివాహమై ఎనిమిదేళ్లు అవుతుంది. పెళ్లై ఇన్నేళ్లవుతున్నప్పటికీ సంతానం కలగకపోవడంతో ఆ దంపతులు ఇద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయితే ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లలు కలుగుతారని తెలుసుకున్న నాగరత్న ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం గజ్వేల్ పట్టణంలో ఉన్న జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఆమె వచ్చి వైద్యసహాయం పొందారు. ఆ విధంగా క్రమంతప్పకుండా మూడో నెల నుంచే చెకప్లు చేయించుకునేది.
ముగ్గురు పండంటి బిడ్డలకు జననం : ఎట్టకేలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరత్న ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. వైద్యనిపుణులు ఆమెకు సీజేరియన్ చేసి చికిత్సనందించారు. నాగరత్నకు ఇద్దరు మగబిడ్డలు, ఓ ఆడబిడ్డ పుట్టారని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే ముగ్గురు పిల్లలు జన్మించడం చాలా సంతోషమన్నారు.
"8 ఏళ్ల వివాహిత ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్(ఐవీఎఫ్) చేయించుకుని మా ఆసుపత్రికి వచ్చారు. మా వైద్యులను కలిశారు. మూడో నెల నుంచే ఇక్కడే రెగ్యులర్ చెకప్, స్కానింగ్లు చేయించుకునేవారు. ఆమె గర్భంలో ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం తక్కువని, అందువల్ల సిజేరియన్ చేయాల్సి ఉంటుందని ఆమెకు చెప్పాం. పేషెంట్ అంగీకరించారు. దీంతో సిజేరియన్ విధానంలో ఆపరేషన్ చేశాం. 3 శిశువులు పుట్టారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు."- అన్నపూర్ణ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్