తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'MSP అమలు కోసం రూ.30వేల కోట్లు కేటాయించాలి'- సాఫీగా రైతుల ఆరో విడత చర్చలు - CENTRE FARMERS MEETING

పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య ఆరో విడత చర్చలు

Centre Farmers Meeting
Centre Farmers Meeting (ANI)

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2025, 6:45 AM IST

Updated : Feb 23, 2025, 8:46 AM IST

Centre Farmers Meeting :పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య ఆరో విడత చర్చలు శనివారం సాఫీగా కొనసాగాయి. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, మార్చి 19న మరోసారి చండీగఢ్‌లో భేటీ కావాలని నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. చండీగఢ్‌లోని మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన సమావేశానికి కేంద్ర మంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, ప్రహ్లాద్‌ జోషి, పీయూష్‌ గోయల్‌ హాజరుకాగా రైతు సంఘాల ప్రతినిధులు 28 మంది పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల అమలుకు నిజంగానే కట్టుబడి ఉంటే ప్రతి ఏడాది ఇందుకు రూ.25వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్ల వరకు నిధులు కేటాయించడం పెద్ద సమస్య కాదని రైతు నేతలు తెలిపారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలనూ వివరించగా సాధికారికమైన గణాంకాలను కేంద్ర బృందం కోరిందని వెల్లడించారు. వారం రోజుల్లో అందిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చాలకు చెందిన జగ్జిత్‌ సింగ్‌ డల్లేవాల్, స్వరణ్‌ సింగ్, కాకా సింగ్‌ కొట్రా తదితర రైతు నేతలు, ఇద్దరు పంజాబ్‌ రాష్ట్ర మంత్రులు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చలకు ముందు రైతు నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ డల్లేవాల్​ను కలిసిన శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గతేడాది నవంబర్ 26 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న డల్లేవాల్ ఈ చర్చల్లో పాల్గొనేందుకు అంబులెన్స్​లో వచ్చారు.

Last Updated : Feb 23, 2025, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details