Published : Nov 30, 2023, 2:18 PM IST
వయసు సహకరించకపోయినా - ఆరోగ్యం బాలేకపోయినా - తగ్గేదేలే అంటున్న ఓటర్లు
Telangana Assembly Elections Polling 2023 : తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. యువత, మహిళలతో పాటు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం ఓటు వేయాల్సిందేనని.. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Patients Voting in Telangana : ఈ క్రమంలోనే ముషీరాబాద్ గాంధీనగర్లోని ఎస్బీఐ కాలనీకి చెందిన ఆస్తమా రోగి లక్ష్మీ శ్యాంసుందర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఘంటసాల గ్రౌండ్లోని 83వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. అస్తమా వ్యాధితో బాధపడుతున్న తన ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తాను బతికి ఉన్నంత వరకు ఓటు వేస్తానని ఈ సందర్భంగా లక్ష్మీ తెలిపారు.
Senior Citizens Voting in Telangana : మరోవైపు దుబ్బాక నియోజకవర్గంలోని 253 పోలింగ్ కేంద్రాల్లో 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వయో వృద్ధులను వీల్ చైర్లలో పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్తున్నారు. ఇంకోవైపు హైదరాబాద్లో తీవ్రమైన లివర్ సిరోసిస్తో బాధపడుతున్న 75 ఏళ్ల శేషయ్య ఆక్సిజన్ సిలిండర్ సాయంతో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. రాష్ట్ర పౌరుడిగా ఓటు వేయడం తన బాధ్యత అని శేషయ్య ఈ సందర్భంగా చెప్పారు.