ర్యాపిడో డ్రైవర్​ వేధింపులు.. రన్నింగ్ బైక్​పై నుంచి దూకేసిన యువతి.. గాయాలతో..

By

Published : Apr 26, 2023, 11:41 AM IST

thumbnail

ర్యాపిడో డ్రైవర్​ వేధింపుల నుంచి తప్పించుకోవడానికి రన్నింగ్​లో ఉన్న బైక్​పై నుంచి యువతి దూకేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 21న రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు.. ఇందిరానగర్​లో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో యాప్‌లో బైక్‌ బుక్‌ చేసింది. యువతిని పికప్ చేసుకున్న బైకర్.. ఓటీపీ వస్తుందని ఆమె ఫోన్​ లాక్కున్నాడు. అనంతరం బాధితురాలు.. వెళ్లాల్సిన ప్రదేశానికి కాకుండా వేరే మార్గంలో తీసుకెళ్తుండగా యువతి అతడిని ప్రశ్నించింది. సమాధానం ఇవ్వకుండా మరింత వేగంగా బైక్‌ను పోనిచ్చాడు డ్రైవర్​. పైగా అతడు మద్యం మత్తులో ఉన్నట్లు బాధితురాలు గుర్తించింది.

దీంతో మరింత భయాందోళనకు గురైన ఆమె.. నాగెనహళ్లి సమీపంలో ఓ ప్రైవేట్​ కళాశాల సమీపంలో బైక్​పై నుంచి ఒక్కసారిగా దూకేసింది. వేగంగా వెళ్తున్న బైక్​పై నుంచి దూకడం వల్ల ఆమె కాళ్లకు స్పల్ప గాయాలయ్యాయి. ఇది గమనించిన ప్రైవేట్ కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను రక్షించారు. ఇది చూసిన ర్యాపిడో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం యువతి.. తన స్నేహితురాలికి కాల్​ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ర్యాపిడో డ్రైవర్​ దీపక్​ను అరెస్ట్​ చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్​కు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో అతడు ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ప్రస్తుతం బాధితురాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.