Police Seized 7 Kgs Gold in Sangareddy : అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారం పట్టివేత.. నలుగురి అరెస్ట్ - తెలంగాణ పోలీసుల తనిఖీలు
🎬 Watch Now: Feature Video


Published : Oct 27, 2023, 1:10 PM IST
Police Seized 7 Kgs Gold in Sangareddy : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చేస్తున్న సోదాల్లో భారీ స్థాయిలో బంగారం పట్టుబడుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసు తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. తెలంగాణ, కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తెల్లవారుజామున వాహన తనిఖీలు చేపడుతుండగా.. స్కార్పియో వాహనంలో తరలిస్తున్న 7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.4.50 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గుజరాత్ నుంచి హైదరాబాద్కు బిస్కెట్లు సహా ఆభరణాల రూపంలో బంగారం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి.. ఎన్నికల అధికారులకు అప్పగించనున్నట్లు చిరాగ్పల్లి ఎస్సై నరేశ్ తెలిపారు.