‘వర్షంలో తడవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం.. వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. తద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ సమయంలో కరోనాతో పాటు ఇతర వైరస్లు, ఇన్ఫెక్షన్లు మనల్ని త్వరగా అటాక్ చేస్తాయి. కాబట్టి బయటికి వెళ్లిన వారు.. తప్పనిసరిగా గొడుగు వెంటబెట్టుకొని వెళ్లాలి. ఇక రోజూ ఆఫీసులకు, ఇతర పనుల రీత్యా బయటికి వెళ్లిన వారు ఆ రోజు వర్షం పడినా, పడకపోయినా తమ హ్యాండ్బ్యాగ్లో ఓ చిన్ని గొడుగును తప్పనిసరిగా ఉంచుకోవాల్సిందే!
నీళ్లు గోరువెచ్చగా..!
వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కలరా, విరేచనాలు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మనం తాగే నీరు ఫిల్టర్ అయినప్పటికీ వాటిని బాగా మరిగించుకొని గోరువెచ్చగా అయ్యాక తాగడం మంచిదంటున్నారు నిపుణులు. రోజుకు రెండుమూడు లీటర్లు తాగడం తప్పనిసరి.. అందులో నిమ్మరసం పిండుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇలా గోరువెచ్చటి నీళ్లు తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. అంతేకాదు.. గోరువెచ్చగా ఉండే నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనాకు దూరంగా ఉండచ్చని ఇప్పటికే నిపుణులు వెల్లడించారు.
అదే మన రక్షణ కవచం!
కాలం మారుతున్న కొద్దీ మనం అప్రమత్తంగా ఉండకపోతే సీజనల్ వ్యాధులు అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. మనం వాటికి ఆ అవకాశం ఇవ్వకూడదనుకుంటే రోగనిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుకోవడం. అది మనం రోజూ తీసుకునే ఆహారం వల్లనే సాధ్యమవుతుంది. ఇందుకోసం విటమిన్ ‘సి’ అధికంగా ఉండే కమలాఫలం, బత్తాయి, అరటి, కివీ.. వంటి పండ్లతో పాటు టొమాటో, ఆకుకూరలు, క్యాబేజీ.. వంటి కాయగూరల్ని రోజూ తీసుకోవాలి. ఆయా కాలాల్లో లభించే పండ్లు కూడా ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని అందిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి మెండుగా ఉంటే సీజనల్ వ్యాధులే కాదు.. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు కూడా!
మీ బ్యాగ్లో ఇవి ఉండాల్సిందే!
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, గొడుగు ఉపయోగించినా, రెయిన్ కోట్ వేసుకున్నా అప్పుడప్పుడూ అనుకోకుండా వర్షంలో తడుస్తాం. ఇలా తడిచిన బట్టలు, మాస్కులతో ఈ సమయంలో మరింత ప్రమాదం. తడిచిన దుస్తులు, మాస్క్లు వైరస్, బ్యాక్టీరియాలను మరింతగా ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో మన శరీరాన్ని, దుస్తులను ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. కరోనాకు దూరంగా ఉండే క్రమంలో పదే పదే చేతులు కడుక్కుంటున్నాం.. ఆపై పొడిగా తుడుచుకోవడం కూడా ముఖ్యమే. ఎందుకంటే చేతి వేళ్ల మధ్యలో తడిదనం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
ఇవి కూడా గుర్తుంచుకోండి!
ఈ వర్షాకాలంలో మనం ఫ్లూ బారిన పడకుండా ఉండాలంటే తగినంత నిద్ర కూడా అవసరమే. రోజుకు ఏడు గంటల కంటే తక్కువ నిద్ర పోయే వారు ఫ్లూ బారినపడే అవకాశం మూడురెట్లు అధికంగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇంట్లో ఎవరికైనా సాధారణ జలుబు, దగ్గు వంటి ఫ్లూ లక్షణాలుంటే వారికి దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ వారితో మాట్లాడాల్సి వచ్చినా, వారికి సేవలు చేయాల్సి వచ్చినా మాస్క్, గ్లౌజులు ధరించడం మర్చిపోవద్దు.
ఇదీ చూడండి: వేములవాడలో పొన్నం ప్రభాకర్ గృహ నిర్బంధం