ఎమ్మార్ విల్లాల విక్రయాలపై ఈడీ నమోదు చేసిన కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ కోనేరు ప్రదీప్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో తన పేరు లేదని... ఈడీ అనవసరంగా ఇరికించిందని ప్రదీప్ పేర్కొన్నారు. ఇదే కేసులో తన సోదరుడు కోనేరు మధుపై ఈడీ కేసును హైకోర్టు కొట్టివేసిందన్నారు. కోనేరు ప్రదీప్పై కూడా ఎలాంటి ఆధారాలు లేనందున ఈడీ కేసు నుంచి తొలగించాలని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదించారు. కోనేరు మధును కేసు నుంచి తొలగించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఈడీ తెలిపింది. సుప్రీంకోర్టు విచారణ తర్వాత పరిశీలిస్తామన్న హైకోర్టు.. కేసును ఈనెల 30కి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఛార్జ్ షీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై సీబీఐ కేసును హైకోర్టు కొట్టివేసినందున.. ఈడీ కేసును కూడా కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న ఉన్నతన్యాయస్థానం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సీబీఐ కోర్టులో ఇండియా సిమెంట్స్ను తొలగించాలన్న క్వాష్ పిటిషన్ విచారణను ఈనెల 23కి హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: NGT: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ ఉల్లంఘనలపై నిపుణుల కమిటీ