జాతీయ అవార్డు గ్రహీత, దంగల్ ఫేం జైరా వాసిం నటనకు గుడ్బై చెప్పేసింది. చిత్ర పరిశ్రమ నుంచి పూర్తిగా తప్పుకొంటున్నట్లు ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించింది. నటనలో భాగంగా తన నమ్మకాన్ని, మతం విలువలను విడిచిపెట్టి జీవించాల్సి వస్తోందనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వివరించింది.
ఫేం వచ్చింది..ప్రశాంతత పోయింది
కశ్మీర్లో పుట్టిన జైరా అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. 2016లో ఆమిర్ఖాన్తో కలిసి దంగల్, తర్వాత సీక్రెట్ సూపర్స్టార్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంది. అయితే తాజాగా పెట్టిన పోస్టులో తను మానసికంగా పడుతున్న వేదనను వెల్లడించింది. అభిమానులు తనను ఆదరించినా ఈ రంగంలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నట్లు చెప్పింది.
" ఐదేళ్ల క్రితం నేను నటనను వృత్తిగా ఎంచుకోవడం నా కెరీర్ను మార్చేసింది. బాలీవుడ్లో అడుగుపెట్టగానే నాకు కావలసిన పేరు లభించింది. నన్ను ఒక విజేతగా యువత అభిమానించడం మొదలుపెట్టారు. ఐదేళ్ల ప్రస్థానంలో నా గెలుపు, ఓటములు కొంచెం కూడా ప్రశాంతతను ఇవ్వలేకపోయాయి. చాలా రోజులుగా నేను అందరిలానే బాధపడుతున్నాను. నాకు అనవసరమైన వాటికోసం నా సమయం, నా భావోద్వేగాలు వెచ్చిస్తున్నాను. చిత్రపరిశ్రమలో నేను బాగానే కుదురుకోగలిగినా.. నేను దీనికి చెందినదానికి కాదనే భావన నన్ను కలచివేస్తోంది".
-జైరా వాసిం, బాలీవుడ్ నటి
మతంతో నా బంధం దెబ్బతింటోంది
" సినీ రంగంలో నాకు కావాల్సిన ప్రేమాభిమానాలు లభించాయి. ఇదే పరిశ్రమ నన్ను నమ్మకాన్ని కోల్పోయేలా కూడా చేసింది. కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ భయాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ నా వల్ల కావడంలేదు. ఈ విషయంలో ఒకసారి కాదు వందసార్లు ఓడిపోయాను. నా ప్రశాంతతను కోల్పోయేలా, భగవంతునితో నాకున్న అనుబంధాన్ని చెడగొట్టేలా చేసే వాతావరణంలో నేను జీవించలేను. అందుకే ఈ కెరీర్నే వీడాలనుకుంటున్నాను" అని వివరించింది వాసిం.
ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన 'ద స్కై ఈజ్ పింక్' సినిమాలో వాసిం కీలక పాత్ర పోషించింది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చిలో విడుదలకు సిద్ధమౌతోంది.