చేయని నేరానికి జైలులోనే 43 ఏళ్లు.. చివరకు.. - 43 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల
అమెరికాకు చెందిన కెవిన్ స్ట్రిక్లాండ్ చేయని నేరానికి 43 ఏళ్ల పాటు జైలు శిక్ష (Kevin Strickland Story) అనుభవించాడు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈనెల 23న నిర్దోషిగా తెలుస్తూ కోర్టు అతడిని జైలు నుంచి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కెవిన్కు ఆర్థిక సాయం అందించేందుకు 'గో ఫండ్ మీ' అనే సంస్థ రూ. 10 కోట్లు విరాళంగా సేకరించింది.

Kevin Strickland Story: చేయని నేరానికి జైలుకు వెళ్లిన వ్యక్తులు నిర్ధోషిగా తేలి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన కెవిన్ స్ట్రిక్లాండ్ అనే వ్యక్తి కూడా హత్య చేశాడన్న ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల జైలుకు వెళ్లాడు. కానీ ఆ జైలు నుంచి స్వేచ్ఛ లభించడానికి అతనికి ఒకటి, రెండు కాదు ఏకంగా 43 సంవత్సరాలు పట్టింది. 18 ఏళ్ల వయసులో అరెస్ట్ అయిన కెవిన్ 62 ఏళ్లు వృద్ధుడిగా జైలు నుంచి బయటకు వచ్చాడు.
అసలు ఏం జరిగింది?
అది 1978 ఏప్రిల్ 25. కాన్సాస్ నగరంలోని ఓ ఇంటిపై గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు దాడి చేశారు. లేరీ ఇన్గ్రామ్, జాన్ వాకర్, షెర్రీ బ్లాక్ అనే ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఘటన నుంచి తప్పించుకున్న సింథియా డౌగ్లస్ అనే మహిళ కాల్పులు జరిపిన నలుగురిలో కెవిన్ ఉన్నాడని భావించి అతని పేరును పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కెవిన్ను అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో కూడా డౌగ్లస్ అదే విషయాన్ని చెప్పింది. కానీ ఆ తర్వాత డౌగ్లస్ తాను పొరబడినట్లు తెలుసుకున్నా.. బహిరంగంగా ఇప్పుడు తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటే కోర్టు తనకు శిక్ష విధిస్తుందేమో అన్న భయంతో ఈ విషయం గురించి కొంతకాలం ఎక్కడా చెప్పలేదు. డౌగ్లస్ సాక్ష్యాన్ని పరిగణించి కెవిన్కు కోర్టు శిక్ష ఖరారు చేసింది.
దశాబ్దాలు గడిచాక మళ్లీ ఈ ఏడాది ఆగస్టులో కెవిన్ శిక్షను సవాల్ చేస్తూ స్థానిక ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న డౌగ్లస్ మృతిచెందం వల్ల కోర్టు ఆమె కుటుంబసభ్యులను, స్నేహితులను విచారించింది. పోలీసులే కెవిన్ దోషి అని చెప్పమని తనను ఒత్తడి చేశారని డౌగ్లస్ ఓ సందర్భంలో తమతో వెల్లడించినట్లు ఆమె తరపు వారు కోర్టుకు తెలిపారు. తాను చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు డౌగ్లస్ ప్రయత్నించిందని పేర్కొన్నారు.
హత్యకు పాల్పడిన నిందితులు కూడా ఓ సందర్భంలో కెవిన్తో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించిన విషయాన్ని కోర్టు ప్రస్తావిస్తూ కెవిన్ను నిర్దోషి అని తేల్చింది. ఈనెల 23న కెవిన్ జైలు నుంచి విడుదలయ్యాడు.
రూ.10 కోట్లు విరాళం
తప్పుడు తీర్పు ఇచ్చినందుకు అందాల్సిన నష్టపరిహారం కూడా కెవిన్కు అందలేదు. దీంతో అతనికి సాయం చేసేందుకు 'గో ఫండ్ మీ' అనే సంస్థ ముందుకొచ్చింది. రూ.10.50 కోట్లు విరాళంగా సేకరించి కెవిన్కు అందించింది.
ఇదీ చూడండి : వారాంతంలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి