హుస్సేన్సాగర్ ప్రక్షాళనకు మరోసారి అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు చేస్తోంది. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యయనానికి కమిటీని సైతం నియమించారు. రెండు, మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు.
గతంలో ఏం చేశారంటే..
సాగర్ దుర్వాసనను తగ్గించేందుకు హెచ్ఎండీఏ 2018లో అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించింది. రూ.3.2 కోట్లు కోట్ చేసిన ఓ సంస్థకు పనులు అప్పగించారు. ఒప్పందం 15 నెలలు అమలైంది. గడువు పూర్తి కాగానే మరోసారి టెండర్లు పిలవగా మరో సంస్థ ఏడాదికి రూ.3.3 కోట్లు కోట్ చేసి దక్కించుకుంది. సాగర్లో మార్పు లేకపోగా కంపు భరించలేకపోతున్నామంటూ ఫిర్యాదులు రావడం వల్ల ఆ సంస్థకు పొడిగింపు ఇవ్వకుండా కాంట్రాక్టును రద్దు చేశారు.
అధ్యయనం చేసి..
ఈ దఫా ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ తదితర సంస్థల ప్రొఫెసర్లు, నిపుణులతో కమిటీ వేశారు. వారు సాగర్ వాస్తవ పరిస్థితిపై అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్ధతులపై ఆరా తీసి వ్యయాన్ని అంచనా వేస్తారు. తక్కువ ఖర్చుతో ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే మార్పు వస్తుందో గుర్తిస్తారు. ఆ పరిజ్ఞానంలో అనుభవమున్న కంపెనీలు రావాలంటూ టెండర్లను ఆహ్వానించి గుత్తేదారును ఎంపిక చేస్తారు.
వ్యర్థాలను వేరు చేసే యంత్రం ఏర్పాటు
ప్రస్తుతం అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన బూమ్ బ్యారియర్ ఆటోమేటెడ్ రైజర్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చి హుస్సేన్సాగర్లో నాలా కలిసే చోట ఏర్పాటుచేశారు. ఇది వివిధ వ్యర్థాలను వేరు చేసి మురుగును మాత్రమే లోపలికి పంపిస్తుంది. ప్రయోగాత్మకంగా బోట్స్ క్లబ్కు సమీపంలో ఇది ఉంది. ఇందుకోసం డబ్ల్యూఆర్ఐఇండియా, డెస్మీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సత్ఫలితాలొస్తే మరిన్ని చోట్ల అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండిః శనగ, వేరుసెనగలకైనా రాయితీ ఇవ్వాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు